వారంలో అయిదు రోజుల పనిదినాలు కావాలట: సమ్మెకు బ్యాంక్ ఉద్యోగులు
ముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగడానికి సమాయాత్తం అయ్యారు. ఈ నెల 27వ తేదీన సమ్మెకు ముహూర్తం పెట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి బ్యాంకింగ్ కార్యకలాపాలను స్తంభింపజేయాలని నిర్ణయించుకున్నారు. తమ డిమాండ్ల పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే.. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
బ్యాంక్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్- వారంలో అయిదురోజుల పనిదినాలు కావాలనేది. ప్రస్తుతం బ్యాంకులు నెలల రెండు వారాల పాటు అయిదు రోజుల పాటు కార్యకలాపాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతి రెండు, నాలుగో శనివారాల్లో బ్యాంకులకు తాళం పడుతుంది. ఆదివారం కూడా సెలవు కావడం వల్ల మళ్లీ అవి తెరచుకునేది సోమవారమే.
బ్యాంక్ ఉద్యోగులు మాత్రం నెలలో అన్ని వారాలు కూడా అయిదు రోజుల పని దినాలను కల్పించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. దీన్ని నెరవేర్చుకోవడానికి సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వానికి డెడ్లైన్ కూడా ఇచ్చారు. గడువులోగా కేంద్ర ప్రభుత్వం వారంలో అయిదు రోజుల పని దినాలకు అంగీకరించకపోతే ఈ నెల 27వ తేదీన సమ్మె చేస్తామని హెచ్చరించారు.
బ్యాంకింగ్ సెగ్మెంట్లో ఉన్న అన్ని యూనియన్లు కలిసికట్టుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. తొమ్మిది బ్యాంక్ యూనియన్లతో కూడిన యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. కాగా 27వ తేదీన సోమవారం. నాలుగో శనివారం, ఆదివారం వరుసగా రెండు సెలవుల తరువాత సోమవారం నాడు సమ్మె నిర్వహించాలని నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా స్తంభించిపోయినట్టవుతుంది. అయిదు రోజుల పనిదినాలు, పింఛన్ సౌకర్యం వంట డిమాండ్లను అంగీకరించకపోతే.. దేశవ్యాప్తంగా ఏడు లక్షలమంది బ్యాంక్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడం అనివార్యమౌతుందని అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సౌమ్యా దత్త స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న నేషనల్ పెన్షన్ పథకాన్ని పక్కన పెట్టి.. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం డిమాండ్ చేశారు. తాము పలుమార్లు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం ఉండట్లేదని అన్నారు.