Bank of Baroda Q4: బోల్తా కొట్టిందిగా: రూ.వెయ్యికోట్లకు పైగా లాస్: నో డివిడెండ్
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా చేదు ఫలితాలను ప్రకటించింది. నికర ఆదాయంలో భారీగా క్షీణతను నమోదు చేసింది. దీని విలువ వెయ్యి కోట్ల రూపాయల పైమాటే. ఈ బ్యాంక్ ఆధీనంలో ఉన్న నిరర్థక ఆస్తులు కొండలా పేరుకుపోవడమే దీనికి కారణమంటూ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. డెఫర్డ్ ట్యాక్స్ అస్సెట్ రివర్సల్ పేరుతో కొత్త పన్నుల విధానాన్ని అనుసరించడం మొదలు పెట్టిన తరువాత ఈ స్థాయిలో ఆ బ్యాంకు తన నికర ఆదాయాన్ని కోల్పోవాల్సి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రూ.1,046 కోట్ల క్షీణత..
ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన గత ఆర్థిక సంవత్సరం అంటే 2020-2021 చివరిదైన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మధ్యాహ్నం ప్రకటించింది. ఈ మూడు నెలల కాలంలో ఆ బ్యాంకు నికర ఆదాయంలో 1,046 కోట్ల రూపాయల మేర క్షీణత నమోదైంది. ఇదివరకటి ఆర్థిక సంవత్సరం అంటే.. 2019-2020లో ఇదే చివరి త్రైమాసికానికి బ్యాంకు 506.6 కోట్ల రూపాయల నికర ఆదాయాన్ని అందుకుంది. సంవత్సరం తిరిగే సరికి ఆ సంఖ్య మైనస్లోకి వెళ్లింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ షేర్ హోల్డర్లకు ఎలాంటి డివిడెండ్ను కూడా ప్రకటించట్లేదని తెలిపింది.
బ్యాంకు నికర వడ్డీ ఆదాయం ఓకే..
ఈ క్షీణత బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందినది మాత్రమే. ఇందులో విలీనమైన విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ల లావాదేవీలను పరిగణణలోకి తీసుకోలేదు. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (నెట్ ఇంటరెస్ట్ ఇన్కమ్), చెల్లింపుల మధ్య నాలుగు శాతం మేర భారీ తేడా కనిపించింది. నికర వడ్డీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం నాలుగు త్రైమాసికాల కాలానికి 7,107 కోట్ల రూపాయలుగా నమోదైంది. 2019-2020 ఆర్తిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది ఎక్కువే. ఇదివరకటి బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 6,798.4 కోట్ల రూపాయలు.
నిరర్థక ఆస్తుల్లో పెరుగుదల..
అదే సమయంలో నిరర్థకక ఆస్తులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి 8.87 శాతం మేర నిరర్థక ఆస్తులు ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. ఇదివరకటి ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంది. 8.48 శాతం నుంచి 8.87 శాతానికి చేరాయి నిరర్థక ఆస్తులు. గత ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికల్లోనూ పెరుగుదల నమోదైంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి బ్యాంకు నిరర్థక ఆస్తులు 2.39 కాగా.. నాలుగో త్రైమాసికం ముగిసే నాటికి ఈ సంఖ్య 3.09కి పెరిగింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల సమీకరణ
కాగా 2021-2022 ఆర్థిక సంవత్సరంలో అయిదు వేల కోట్ల రూపాయలను సమీకరించుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. ఇందులో 2,000 కోట్ల రూపాయలను క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) సహా వేర్వేరు మార్గాల్లో సేకరించాలని నిర్ణయించింది. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల వల్ల ఆశించిన స్థాయిలో బ్యాంక్ లావాదేవీలు నమోదు కాలేదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లను కూడా అంచనా వేస్తోన్నామని స్పష్టం చేసింది.