బ్యాంకు ఉద్యోగులకు గుడ్న్యూస్, 15% వేతన పెంపు: వారానికి 5 డేస్ వర్కింగ్పై నిరాశ
దేశంలోని 8 లక్షలమంది ఉద్యోగులకు గుడ్న్యూస్. వీరికి 15 శాతం వేతనం పెంచేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA) ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు దీపావళి పండుగ సమయంలో IBA ఈ శుభవార్త అందించింది. 2017 నుండి వేతన పెంపు పెండింగ్లో ఉంది. బ్యాంకు సంఘాలు, ఉద్యోగులకు ప్రాతినిథ్యం వహిస్తున్న UFBU, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్-IBA మధ్య మూడేళ్లుగా సాగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. దీంతో ఉద్యోగుల వేతనం పెరగనుంది.
ఖతార్ భలే స్కీం, ఇంటి కొనుగోలుదారులకు 'ఫర్ సేల్' ఆఫర్
15 శాతం వేతనం ఎప్పటి నుండి ఎప్పటి వరకు
బ్యాంకు ఉద్యోగులు, IBA మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వేతనాల పెంపు 15 శాతం వేతన పెంపు అమలు చేయనున్నారు. బ్యాంకు ఉద్యోగులకు వేతన పెంపుతో రూ.7,898 కోట్ల వర్షిక అదనపు భారం పడుతోంది. 15 శాతం వేతన పెంపు 2017 నవంబర్ నుండి 2022 అక్టోబర్.. అంటే ఐదేళ్ల కాలానికి వర్తిస్తుంది. UFBU కన్వీనర్ సిహెచ్ వెంకటాచలం, IBA ప్రతినిధులకు మధ్య ఒప్పందం జరిగింది. పే-రివిజన్ ఒప్పందం ద్వారా 35 బ్యాంకుల ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని వెంకటాచలం అన్నారు. 12 ప్రభుత్వరంగ, 10 ప్రయివేటు రంగ, 7 విదేశీ బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
నవంబర్ వేతనంతో కలిసి...
2012లో ఉద్యోగులకు 15 శాతం వేతనం పెరిగింది. 2017లో మళ్లీ పే-రివిజన్ ఉన్నప్పటికీ ఇరువర్గాల చర్చల వల్ల చాలా ఆలస్యమైంది. 2017-22 కాలానికి గాను IBA 12.25 శాతం వేతన పెంపు ఆఫర్ చేయగా, ఉద్యోగ సంఘాలు 20 శాతాన్ని డిమాండ్ చేశాయి. సుదీర్ఘ చర్చల అనంతరం ఇప్పుడు 15 శాతం వేతన పెంపు ఇచ్చారు. ఇంక్రిమెంట్ బకాయిలను నవంబర్ వేతనంతో కలిసి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకు(PSB)లలో పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల పథకం(PLI) అమలుకు ఆమోదం లభించింది. PSBలలో ఈ స్కీం అమలు చేయడం ఇదే మొదటిసారి. ఆయా బ్యాంకులు తమ నిర్వహణ లేదా నికర లాభం ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేస్తాయి. బ్యాంకు ఉద్యోగుల్లో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు మంచి సామర్ధ్యం కనబరిచినవారిని ప్రోత్సహించే లక్ష్యంతో సామర్ధ్య ఆధారిత వేతనాల పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టామని IBA ప్రకటనలో తెలిపింది.
5 రోజుల బ్యాంకింగ్కు నో
కేంద్ర వేతన సంఘ సిఫార్సును వర్తింపచేయాలని, వారానికి అయిదు రోజుల పని, కుటుంబ పెన్షన్ తాజాపరచడం వంటి మూడు ప్రధాన డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. తొలి రెండు డిమాండ్లపై ఆశించిన ఫలితాలు రాలేదు. కుటుంబ పెన్షన్ పథకం డిమాండును ప్రభుత్వానికి ప్రతిపాదించేందుకు IBA అంగీకరించింది. ఈ పథకాన్ని బ్యాంకు ఉద్యోగులకు వర్తింపచేయడంపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోనుంది.
1-11-2017 నుండి వేతన సవరణకు నేడు (11-11-2020) సంతకాలు జరిగాయని, మూడేళ్ల 11 రోజుల తర్వాత ఒప్పందం జరిగిందని, కానీ 5డే బ్యాంకింగ్కు ఆమోదం రాలేదని బ్యాంకర్స్ యునైటెడ్ అఫీషియల్స్ ట్వీట్ చేసింది.