ప్రయివేటీకరణలో ఈ బ్యాంకుల్లేవ్: ఉద్యోగుల శాలరీ, పెన్షన్పై హామీ!
రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకింగా పది ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు సోమవారం నుండి రెండ్రోజుల పాటు సమ్మెలో పాల్గొన్నారు. PSBs ప్రయివేటీకరణ అంశంపై నీతి అయోగ్ ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల్లో ఇప్పటి వరకు ఆరు బ్యాంకులను పక్కన పెట్టింది. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్ని బ్యాంకులను ప్రయివేటీకరించడం లేదని స్పష్టం చేశారు.
ప్రయివేటీకరణకు ఇవి దూరం
ప్రభుత్వం రెండు PSBsను ప్రయివేటీకరించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఇటీవల నీతి అయోగ్ చేసిన సిఫార్సుల్లో ఆరు బ్యాంకులను మినహాయించారు. అంటే ఈ బ్యాంకులు ప్రయివేటీకరణ జాబితా నుండి తప్పుకున్నట్లే. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB), ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI), కెనరా బ్యాంక్ ఉన్నాయి. నీతి ఆయోగ్ చేసిన ప్రతిపాదనలను పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్)తో పాటు పెట్టుబడుల ఉపసంహరణపై ఏర్పాటయిన కార్యదర్శుల ప్రధాన బృందం పర్యవేక్షిస్తుంది. ఆ తర్వాత వీటిని ఆర్థిక శాఖకు పంపించడం, అక్కడ ఆమోదం తర్వాత వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏర్పాటయిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం వద్దకు పంపిస్తారు. ఒక్కో ప్రతిపాదనను పరిశీలించి ఆమోద ముద్ర వేస్తారు.
సమ్మెపై నిర్మలమ్మ ఏమన్నారంటే
అయితే ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. దీంతో తాజాగా ప్రయివేటీకరణపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అన్ని బ్యాంకులను ప్రయివేటీకరించడం లేదన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు కొనసాగుతాయని పబ్లిక్ ఎంటర్ప్రైస్ పాలసీ స్పష్టంగా పేర్కొందన్నారు. అన్ని ప్రభుత్వ బ్యాంకులను ప్రయివేటీకరణ చేస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. ప్రయివేటీకరించిన బ్యాంకులు కూడా కొనసాగుతాయని, వాటిలోని ఉద్యోగుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతోందని, జీతాలు, ఫించన్లను రక్షిస్తామన్నారు.
నిబంధనలకు అనుగుణంగా
ప్రభుత్వ సంబంధ కార్యకలాపాల కోసం ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా పలు బ్యాంకులకు ఇప్పటికే అనుమతి ఇవ్వడం జరిగిందని నిర్మలమ్మ చెప్పారు. ఇలాంటి అనుమతుల కోసం ఆర్బీఐని సంప్రదించే కొత్త బ్యాంకులు ఇందుకు సంబంధించి ప్రస్తుత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. బ్యాంకింగ్ రెగ్యులేటర్గా ఆర్బీఐ ఇప్పటికే ఇందుకు సంబంధించి పటిష్ట నియమ నిబంధనలను అమలు చేస్తోంది. ఇలాంటి అనుమతులను ప్రయివేటు బ్యాంకులకు మంజూరు చేయడం వల్ల ప్రభుత్వరంగ బ్యాంకులపై ప్రతికూల ప్రభావం ఉండదు. పలు ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రయివేటురంగ బ్యాంకులు ప్రభుత్వ సంబంధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.