బ్యాడ్ న్యూస్: ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మిషన్ ధరలు 10% వరకు పెరుగుతాయ్
ఎయిర్ కండిషనర్లు(AC), రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ వంటి ఎలక్ట్రానిక్ కన్స్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్పుట్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు ఐదు శాతం నుండి పది శాతం మేర పెరగవచ్చు. ముడి పదార్థాల ధరలతో పాటు రవాణా ఛార్జీలు ఎక్కువ కావడంతో ఆ భారాన్ని కొనుగోలుదారులకు బదలాయించేందుకు కంపెనీలు సిద్ధపడుతున్నాయి.
ఎల్జీ, పానాసోనిక్, హేయర్ వంటి కంపెనీలు ఇప్పటికే ధరలను కాస్త పెంచాయి. సోనీ, గోద్రేజ్, హిటాచీ వంటి కంపెనీలు ధరల పెంపు దిశగా నిర్ణయించుకునే అవకాశాలున్నాయి. సాధారణంగా వేసవి కాలానికి ముందు జనవరి-మార్చి కాలంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలను కంపెనీలు పెంచుతుంటాయి.
10 శాతం వరకు ధరల పెంపు
ఎలక్ట్రానిక్ గృహోపకరణాల ధరలను కంపెనీలు ఐదు శాతం నుండి ఏడు శాతం మేర వేసవి కాలానికి ముందు పెంచడం జరుగుతుందని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) ప్రెసిడెంట్ తెలిపారు.
హేయర్ అప్లియెన్సెస్ ఇండియా రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్లు, ఏసీల ధరలను మూడు శాతం నుండి ఐదు శాతం పెంచుతోంది.
పానాసోనిక్ కూడా ఏసీ ధరలను 8 శాతం మేర పెంచింది. ఇతర ఉత్పత్తుల ధరలను కూడా పెంచే ఆలోచన చేస్తోంది.
ఎల్జీ కంపెనీ హోమ్ అప్లియెన్సెస్ పైన ధరలను పెంచింది.
ధరల పెరుగుదల అనివార్యంగా మారిందని, ఈ నేపథ్యంలో కంపెనీలు పెంచుతున్నట్లు ఈ రంగంలోని వారు అంటున్నారు. జాన్సన్కు చెందిన హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఉత్పత్తుల ఆధారంగా ఏప్రిల్ నెల వరకు ధరలను 10 శాతం మేర పెంచనుంది.
అందుకే ధరల పెంపు
సోనీ, గోద్రేజ్ అప్లియెన్సెస్ కంపెనీలు ఇతర ఉత్పత్తుల ధరలను కూడా పెంచాలా వద్దా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వ్యాపార సుస్థిరత కోసం ధరలను పెంచక తప్పడం లేదని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సల్ అన్నారు. అల్యూమినియం, రిఫ్రిజిరేటర్స్ పైన యాంటీ డంపింగ్ సుంకాల భారం వల్ల వీటి ధరలను రెండు శాతం నుండి మూడు శాతం పెంచుతున్నట్లు హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఇండియా సీఎండీ గుర్మీత్ సింగ్ తెలిపారు.
ముడిసరుకుల ఖర్చు పెంపు
ముడిసరకుల, లాజిస్టిక్స్ ఖర్చులు ఎగబాకిన దృష్ట్యా గృహోపకరణాల ధరలను పెంచినట్లు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తయారీ సంస్థ ఎల్జీ తెలిపింది. మరోవైపు వినియోగ, ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తులకు మళ్లీ కరోనా భయం పట్టుకుంది. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి చోట్ల ఇప్పటికే కర్ఫ్యూ అమలవుతోంది. దీంతో 25 సాతం ఉద్యోగులు ఉత్పత్తి కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెంపు అనివార్యమంటున్నారు.