ఆర్థిక ఇబ్బంది, ఆ అవకాశం ఉపయోగించుకుంటున్నారు! క్రెడిట్ కార్డ్పై లోన్ సామర్థ్యం తగ్గింపు
కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ సంవత్సరంలో ఎన్పీఏలు పెరుగుతాయని ప్రయివేటు సెక్టార్ లెండర్ యాక్సిస్ బ్యాంక్ అంచనా వేస్తోంది. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి తిరిగి పూర్వస్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం, నాలుగో త్రైమాసికంలో రిటైల్ ఎన్పీఏలు భారీగా పెరగవచ్చునని భావిస్తోంది. కరోనా కారణంగా అన్ని రంగాలపై ప్రభావం పడింది. వివిధ రంగాల్లోని సంస్థలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటాయి. కరోనా వల్ల కార్యకలాపాలు నిలిచిపోవడంతో బ్యాంకులకు ఈఎంఐలు కూడా ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో మార్చి నుండి ఆగస్ట్ వరకు మారటోరియం వెసులుబాటు కల్పించారు.
క్రెడిట్ కార్డులు జూమ్, భారీగా పెరిగిన వినియోగం: కొన్ని రంగాల్లోని వారికి కార్డ్స్ కష్టంగా..
క్రమంగా మెరుగు
కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో వివిధ ఆర్థిక సంస్థలు ఉద్యోగుల తొలగింపు, వేతన కోతలకు దిగడంతో రిటైల్ రుణ చెల్లింపుల సామర్థ్యం తగ్గిందని యాక్సిస్ బ్యాంకు రిటైల్ రుణ విభాగాధిపతి తెలిపారు. ఇప్పుడిప్పుడే నెలవారీగా చెల్లించే ఈఎంఐలు మెరుగు పడుతున్నాయని, అయినా డిసెంబర్ త్రైమాసికం, మార్చి త్రైమాసికాలలో రిటైల్ ఎన్పీఏలు పెరగవచ్చునని తెలిపారు.
లోన్ రీస్ట్రక్చర్ ఉపయోగించుకుంటున్నారు..
2021 ఏప్రిల్ నుండి తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశముందన్నారు. అంటే 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి కోలుకోవచ్చునని తెలిపారు. ఆగస్ట్ వరకు రుణ మారటోరియం ఉండటంతో చాలామంది రుణగ్రహీతలు దీనిని వినియోగించుకున్నారు. అక్టోబర్ నుండి చెల్లిస్తున్నారు. అయితే ఎక్కువ మంది లోన్-రీస్ట్రక్చరింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నారు. డిసెంబర్ 31వ తేదీ వరకు లోన్ రీస్ట్రక్చర్ దరఖాస్తులకు వెసులుబాటు ఉంది. ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడంతో దీనిని ఉపయోగించుకుంటున్నారు.
క్రెడిట్ కార్డు రుణ సామర్థ్యం తగ్గింపు
కొత్త రుణాల విషయానికి వస్తే కరోనా పూర్వస్థితికి చేరుకున్నట్లు చెబుతున్నారు. రిస్క్ ఎక్కువగా ఉండటంతో క్రెడిట్ కార్డుల ఇచ్చే రుణాల సామర్థ్యాన్ని అరవై శాతం నుండి డెబ్బై శాతంగానే పరిమితం చేసినట్లు చెబుతున్నారు.