ఇళ్ల నిర్మాణం ఖర్చు 12 శాతం వరకు పెరిగింది, ఎందుకంటే?
ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కొల్లియర్స్ ఇండియా ప్రకారం డెవలపర్లకు సగటు నిర్మాణం ఖర్చు గత ఏడాదితో పోలిస్తే 10 శాతం నుండి 12 శాతం పెరిగింది. అధిక రుణాలు, నిధుల లేమితో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న దేశీయ డెవలపర్లకు నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదల గుదిబండగా మారింది. నిర్మాణ వ్యయంలో అధిక వాటా ఉండే సిమెంట్, స్టీల్ ధరలు గత ఏడాది కాలంలో 20 శాతం పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం 10 శాతం నుండి 12 శాతం పెరిగినట్లు కొల్లీయర్స్ రీసెర్చ్ తెలిపింది.
హోల్ సేల్ ద్రవ్యోల్భణం, మెటీరియల్ ధరలు డబుల్ డిజిట్ పెరుగుదలను నమోదు చేస్తోంది. దీంతో ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ వ్యయం అదనంగా 8 శాతం నుండి 9 శాతం మేర పెరుగవచ్చునని అంచా వేస్తోంది. కరోనా నేపథ్యంలో ట్రాన్సుపోర్ట్ పరిమితులు, ఇంధన వనరుల ధరలు పెరిగాయి. దీంతో ఇన్ పుట్ కాస్ట్ పెరిగినట్లు చెబుతున్నారు.
2021 మార్చి నెలతో పోలిస్తే ఈ ఏడాది మార్చి నెలలో స్టీల్ ధరలు 30 శాతం, సిమెంట్ ధరలు 22 శాతం, కాపర్ 40 శాతం, అల్యూమినియం 44 శాతం, ఇంధన వనరుల ధరలు 70 శాతం మేర పెరిగినట్లు చెబుతున్నారు. దీంతో గత ఏడాది మార్చిలో నివాస సముదాయాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.2,060 కాగా, ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,300కు పెరిగింది. ఇండస్ట్రియల్ నిర్మాణ వ్యయం గత ఏడాది రూ.1900 నుండి రూ.2100కు పెరిగింది.