మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అరబిందో ఫార్మా...
మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అవతరించాలని అరబిందో ఫార్మా లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నోవార్టిస్కు చెందిన శాండోజ్ ఇన్కార్పొరేషన్ కమర్షియల్ ఆపరేషన్స్ కొనుగోలు మాత్రం దీనికి మినహాయింపు అని అరబిందో ఫార్మా పేర్కొంది.
అంతకుముందు ఉన్న రుణ భారంతో పోల్చుకుంటే.. ఈ ఏడాది కంపెనీ రుణభారం కొంత తగ్గింది. మరోవైపు శాండోజ్ను చేజిక్కించుకున్న తొలిఏడాదిలోనే 900 మిలియన్ డాలర్ల అమ్మకాలు సాధించగలమనే విశ్వాసాన్ని అరబిందో ఫార్మా వ్యక్తపరిచింది.
క్రమంగా అప్పులు తగ్గించుకుంటూ...
దేశీయ కంపెనీ అరబిందో ఫార్మా లిమిటెడ్ క్రమంగా అప్పులు తగ్గించుకుంటూ వస్తోంది. మూడేళ్లలో ఒక్క శాండోజ్ ఎక్విజిషన్కు వెచ్చించే వ్యయం మినహా రుణ రహిత కంపెనీగా మారాలని ప్రణాళికలు రచించుకుంటోంది. అరబిందో అప్పుల్లో ఎక్కువ భాగం ఫారిన్ కరెన్సీ డినామినేషన్లోనే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికానికి కంపెనీ అప్పులు అంతకుముందు త్రైమాసికంతో పోల్చితే 71 మిలియన్ డాలర్లు తగ్గి.. 522 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ ఏడాది ముగింపు నాటికి ఈ అప్పులను 150200 మిలియన్ డాలర్ల మేర తగ్గించుకోవాలని అరబిందో లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎఫ్వో సంతానం సుబ్రమణియన్ వెల్లడించారు.
శాండోజ్ కొనుగోలు వ్యవహారం...
నోవార్టిస్కు చెందిన శాండోజ్ ఇన్కార్పొరేషన్ కమర్షియల్ ఆపరేషన్స్ను కొనుగోలు చేయనున్నట్లు గత ఏడాది సెప్టెంబర్లో అరబిందో ఫార్మా ప్రకటించింది. ఈ కొనుగోలు కోసం 900 మిలియన్ డాలర్లు వెచ్చించనుంది. శాండోజ్ ప్రోడక్ట్స్, మూడు ఫెసిలిటీస్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి.. లేదంటే వచ్చే ఏడాది జనవరి కల్లా తమ చేతికి రావచ్చని మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ్ గోవిందరాజన్ తెలిపారు. ఈ ఎక్విజిషన్కు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ నుంచి తుది అనుమతి రావలసి ఉందని ఆయన పేర్కొన్నారు.
తొలి ఏడాదిలోనే 900 మిలియన్ అమ్మకాలు...
త్వరలో తను చేజిక్కించుకోబోయే శాండోజ్పై అరబిందో ఫార్మా అధిక ఆశలు పెట్టుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి.. లేదంటే వచ్చే ఏడాది జనవరి కల్లా శాండోజ్కు చెందిన 300 ఉత్పత్తులు, అమెరికాలోని 3 తయారీ యూనిట్లు అరబిందో పరం కానున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే శాండోజ్ ఉత్పత్తుల ద్వారా తొలి ఏడాదిలోనే 900 మిలియన్ డాలర్ల అమ్మకాలు సాధించగలమని, తద్వారా దీని కొనుగోలుకు పెట్టిన పెట్టుబడి మొత్తం తొలి ఏడాదిలోనే తిరిగి వస్తుందనే నమ్మకంతో అరబిందో పావులు కదుపుతోంది.
మూడు యూనిట్లలో యూఎస్ ఎఫ్డీఏ పున:తనిఖీలు...
ఇక అరబిందో కంపెనీకి చెందిన మూడు తయారీ యూనిట్లలో యూఎస్ ఎఫ్డీఏ రీ-ఇన్స్పెక్షన్ జరుగుతుందని భావిస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ్ గోవిందరాజన్ తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోగా లేదంటే ఏప్రిల్లో ఈ రీ-ఇన్స్పెక్షన్ ఉండొచ్చని, ఈ పున: తనిఖీలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలూ తాము తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.