ఆంధ్రప్రదేశ్ నుంచి రిలయన్స్ వెనక్కి!! పలు టాప్ కంపెనీల పెట్టుబడులు ప్రశ్నార్థకం?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండు ఒప్పందాల్ని కుదుర్చుకుంది. ఇందులో ఒకదాని నుంచి రిలయన్స్ వైదొలగనున్నట్లుగా ప్రచారం జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. తిరుపతి సమీపంలో రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేయదలిచిన ఎలక్ట్రానికి పరికరాల మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఆలోచనను విరమించుకుందట. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్లాంట్ కోసం అప్పుడే భూములు కేటాయించింది. ఇందులో కొన్ని కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయట.
లాయర్లకు జగన్ గుడ్న్యూస్: లా నేస్తం స్కీం, అర్హత, దరఖాస్తు వివరాలు
రెండింట ఓ పరిశ్రమపై వెనక్కి తగ్గిన రిలయన్స్?
రూ.52 వేల కోట్లతో ఏపీలో రెండు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గత టీడీపీ ప్రభుత్వం, రిలయన్స్ మధ్య ఎంవోయులు కుదిరాయి. వాటిలో ఒకటి తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమ, రెండోది కాకినాడ సమీపంలో చమురు సహజవాయు నిక్షేపాలు వెలికితీసే ప్రాజెక్టు. ఇందులో తిరుపతి ఎలక్ట్రానికి పరికరాల పరిశ్రమపై ఆ కంపెనీ తగ్గిందని వార్తలు వస్తున్నాయి. కేజీ బేసిన్లో చమురు, సహజవాయు నిక్షేపాల్ని వెలికితీసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని కొనసాగించేందుకు మాత్రం సుముఖంగా ఉన్నారట. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో పలు ఎంవోయులు జరిగాయని వాటిలో చాలామంది ముందుకు రావడం లేదని, రిలయన్స్ పరిస్థితి అలాగే ఉందని మంత్రి గౌతమ్ రెడ్డి చెబుతున్నారట.
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రాకపై అనిశ్చితి
ఏపీకి ప్రముఖ ఇండస్ట్రీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రాకపై అనిశ్చితి ఏర్పడిందని కూడా వార్తలు వచ్చాయి.
ఈ సంస్ధ ఏపీలో రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒకే చెప్పింది. ఈ కంపెనీ రాకతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని భావించారు. దీనికి విశాఖపట్నంలో భూమి ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించినా అది జరగలేదు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఈ కంపెనీకి భూకేటాయింపు జరగలేదు. దీంతో ఆ సంస్థ పెట్టుబడులపై ఆసక్తి చూపించడం లేదని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
లూలూ కంపెనీ
రూ.2,200 కోట్ల పెట్టుబడితో 7వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటల్తో కూడిన హబ్ను నిర్మించేందుకు గతంలో ప్రభుత్వం లూలూ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ కొచ్చిలో 15 లక్షల చ.అ.ల్లో ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మించింది. ఇప్పుడు విశాఖలో 20 లక్షల చ.అ.ల్లో నిర్మించాలని భావించింది. గత ప్రభుత్వం విశాఖలో భూమి కేటాయించింది. కానీ ఇప్పుడు లూలూ కంపెనీ ప్రతిపాదన వెనక్కి తీసుకోవడంతో ఈ కంపెనీకి ఇచ్చిన భూములను ప్రభుత్వం రద్దు చేసింది.
పెట్టుబడుల పరిమాణం తగ్గించిన అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ విశాఖలో రూ.70వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దశలవారీగా ఈ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఇప్పడు దానిని రూ.3500 కోట్లకు పరిమితం చేసిందట. పదేళ్లలో దశలవారీగా పెట్టే పెట్టుబడులకు ఇప్పటి నుంచే భారీగా భూములు అప్పగించడం సరికాదని ప్రభుత్వం భావించింది. కేటాయింపులు తగ్గించింది. దీంతో అదానీ తన పెట్టుబడుల పరిమాణాన్ని తగ్గించుకుందట.