ఆత్మనిర్భర్ భారత్ : ఉద్యోగాల కల్పనకు రూ.1584 కోట్లు కేటాయించిన కేంద్రం
ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజనా పథకం కింద ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం కేంద్ర కేబినెట్ రూ.1584 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. అలాగే 2020-2023కి ఉద్యోగ,ఉపాధి కల్పన నిమిత్తం మొత్తం రూ.22,810 కోట్లు ఇందుకోసం కేటాయించారు. దీని ద్వారా 58.5లక్షల మంది లబ్ది పొందుతారని కేంద్రం చెబుతోంది.
అక్టోబర్ 1,2020 నుంచి జూన్ 30,2021 వరకూ ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని... త్వరలోనే దీనికి సంబంధించిన నియమ నిబంధనలను నోటిఫై చేస్తామని కేంద్రమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. ఈ పథకం కింద వెయ్యి మంది ఉద్యోగులను కలిగిన ప్రైవేట్ కంపెనీలు నిర్ణీత కాల వ్యవధిలో కొత్త ఉద్యోగాలు సృష్టించగలిగితే... అందుకు గాను కేంద్రం 24శాతం రీయింబర్స్మెంట్ చెల్లిస్తుంది. ఇందులో ఉద్యోగులకు 12శాతం,ఉద్యోగ యజమానికి 12శాతం వాటా ఉంటుంది.
బుధవారం(డిసెంబర్ 9) జరిగిన కేబినెట్ సమావేశంలో దేశంలో పీఎం-వైఫై యాక్సెస్ పేరుతో భారీ వైఫై నెట్వర్క్ను కూడా అందుబాటులోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు మరో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దేశంలో పబ్లిక్ డేటా సెంటర్స్ కూడా తెరుస్తామని... ఇందులో యాక్సెస్ కోసం ఎటువంటి ఫీజులు,రిజిస్ట్రేషన్లు,లైసెన్సులు ఉండవని స్పష్టం చేశారు.
ఈ ఏడాది నవంబర్ 12న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మనిర్భర్ భారత్ 3.0 పేరుతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడం కోసం ప్రధానంగా 12 అంశాలను ప్రస్తావించారు. ఇందులో భాగంగానే ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం భారీగా నిధులు కేటాయించారు.