ఓయో రూమ్స్: జెవెల్ కాదది... వైట్ ఎలిఫెంట్, ది న్యూ యార్క్ టైమ్స్ కథనం!
ఓయో రూమ్స్. ఇండియన్ స్టార్టుప్ కంపెనీల్లో ఒక స్టార్ కంపెనీ. వేగంగా యునికార్న్ క్లబ్ లో చేరిన కంపెనీల్లో ఒకటి. అంతే కాదు ఇప్పటి వరకు ఏ ఇండియన్ కంపెనీకి సాధ్యం కానంత వేగంగా గ్లోబల్ లెవెల్ లో కార్యకలాపాలు విస్తరించిన ఏకైక కంపెనీ కూడా ఓయో రూమ్స్. అమెరికా, చైనా వంటి దేశాల్లోనూ పాగా వేసి మరిన్ని దేశాల్లో విస్తరణకు సిద్ధమవుతోంది. సుమారు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ 70,000 కోట్లు) వాల్యుయేషన్ కలిగిన ఈ కంపెనీ భారీ ఎత్తున ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది.
జపాన్ కు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ మసాయాషి సొన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంకు ఇందులో అతి పెద్ద వాటాదారు. ఒక సందర్భంలో ఓయో రూమ్స్ గురించి ప్రస్తావిస్తూ మసాయాషి సొన్ అది తమ పెట్టుబడి కంపెనీల్లోకి ఒక జెవెల్ అని పేర్కొన్నారు. కానీ ఇటీవల ఓయో రూమ్స్ పనితీరు, బిజినెస్ మోడల్ పై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతకంతకూ నష్టాల్లోకి కూరుకుపోతూ... తన తో ఒప్పందం చేసుకున్న హోటల్స్ ను కూడా నిండా ముంచేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యం అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక న్యూ యార్క్ టైమ్స్ ఒక పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. అందులో ఓయో ను ఎలిఫెంట్ అని అభివర్ణించింది. అందులో నుంచి కొన్ని వివరాలు మీ కోసం.
ఈ కంపెనీల్లో పెట్టుబడి మెరుగైన రాబడికి అవకాశం
7 ఏళ్ళ ప్రస్థానం...
రితేష్ అగర్వాల్ అనే 19 ఏళ్ళ కాలేజీ డ్రాప్ అవుట్ కుర్రాడు 2013 లో ఓయో రూమ్స్ అనే స్టార్టుప్ కంపెనీకి పురుడు పోశాడు. హోటల్స్ లో మిగిలిపోయిన రూమ్స్ ను ఒక బ్రాండ్ కిందకు చేర్చి ఆన్లైన్ లో తక్కువ ధరకే వాటిని వినియోగదారులకు అందించాలన్న లక్ష్యంతో ఓయో ను స్థాపించాడు. మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చినా... హోటల్స్ కూడా ఈ ఆలోచన నచ్చింది. ఊరికే ఖాళీగా ఉండే బదులు నెలకు కొంత తప్పనిసరి ఆదాయం వస్తుంది కాబట్టి చాలా హోటల్స్ ఓయో రూమ్స్ గొడుగు కిందకు చేరిపోయారు. ఓయో ను వస్తున్నా ఆదరణ చూసిన ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులు కుమ్మరించారు. ఇక అక్కడితో వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఒక్క ఢిల్లీ లో ఉన్న కంపెనీ కాస్త దేశ వ్యాప్త బ్రాండ్ గా మారిపోయింది. ఇది గతం.
80 దేశాలు... 12 లక్షల గదులు...
ప్రస్తుతం ఓయో రూమ్స్ గ్లోబల్ బ్రాండ్ అయిపోయింది. సుమారు 80 దేశాలకు విస్తరించింది. ఇందులో అమెరికా, చైనా వంటి పెద్ద మార్కెట్లు కూడా ఉండటం విశేషం. దాదాపు 12 లక్ష హోటల్ గదులను ఓయో రూమ్స్ నిర్వహిస్తోంది. 20,000 మంది ఉద్యోగాలులను కలిగి ఉంది. 2023 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద సింగల్ బ్రాండ్ హోటల్ నిర్వాహక సంస్థగా ఎదగాలని ఓయో లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా సాఫ్ట్ బ్యాంకు సహా... పలు ఇన్వెస్టర్ల నుంచి 2.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ 17,500 కోట్లు) సమీకరించింది. కానీ ఎంత విస్తరించినా ఆదాయం పెరగక పోగా నష్టాలు తోడవుతున్నాయి. ఉద్యోగుల్లో 80% మంది పని ఒత్తిడి తట్టుకోలేక ఏడాది లోపే ఉద్యోగం మానేస్తున్నారు. ఇష్టపడి ఓయో లోకి వచ్చిన హోటల్స్ ఇప్పుడు ఓయో ను కోర్ట్ కు ఈడుస్తున్నాయి. తమకు ఒప్పందం ప్రకారం రెంటల్స్ చెల్లించటం లేదని గగ్గోలు పెడుతున్నాయి.
పోలీస్ లకు ఉచిత వసతి...
ఓయో రూమ్స్ నిర్వహిస్తున్న చాలా హోటల్స్ కు సరైన లైసెన్స్ లు లేవు. అందుకే ప్రభుత్వం నుంచి, పోలీస్ ల రైడ్స్ నుంచి తప్పించుకునేందుకు పోలీస్ లకు ఉచితంగా హోటల్ గదులను ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని న్యూ యార్క్ టైమ్స్ పేర్కొంది. చాలా హోటల్స్ లో పెళ్లికాని జంటలు రూమ్స్ బుక్ చేస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటె... కావాలనే హోటల్ యజమానులకు సర్వీస్ లోపం నెపంతో బిల్లుల చెల్లింపు ఆలస్యం చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు. సో, ఇలా అనేక రకాల ఆరోపణలతో పాటు ... లాభసాటిగా లేని వ్యాపార మోడల్ వల్ల ఓయో ఒక ఎలిఫెంట్ గా మారిపోతోంది న్యూ యార్క్ టైమ్స్ అభిప్రాయపడింది.
ఫెయిల్ అయితే కష్టమే...
భారత స్టార్టప్ కంపెనీల్లో ఒక ప్రధాన మైన కంపెనీగా ఉన్న ఓయో రూమ్స్... ఏదేని కారణం చేత ఫెయిల్ అయితే... అది మొత్తం ఇండియన్ స్టార్టుప్ సంస్థలకు గొడ్డలి పెట్టు అవుతుందని న్యూ యార్క్ టైమ్స్ పేర్కొంది. ఓయో తో పాటు పేటీఎం వంటి సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విదేశి ఇన్వెస్టర్ల కూడా మంచిది కాదని తెలిపింది. చూడాలి మరి ముందు ముందు ఏం జరగనుందో!