కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ రూ.5,000కు పెంచండి, అన్ని రంగాలకు ఎన్ని లక్షల కోట్లు అవసరమంటే?
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాల లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో PoS మిషన్ కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ పరిధిని రూ.5,000కు పెంచాలని అసోచామ్ ఆదివారం ప్రభుత్వాన్ని, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియను కోరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సామాజిక దూరాన్ని ప్రోత్సహించేందుకు డిజిటల్ చెల్లింపులపై దృష్టి సారించాలన్నారు. వ్యాపారులు ఎక్కువ మొత్తం డిజిటల్ చెల్లింపులు తీసుకునేలా వెసులుబాటు కల్పించాలన్నారు.
రూ.1.70 లక్షల కోట్ల తర్వాత.. కేంద్రం నుండి మరో ప్యాకేజీ?
విదేశాల్లోని వారికి లాభం
VPA, IFSC, SWIFT కోడ్ వంటి టెక్నాలజీ ప్లాట్ఫామ్లు ద్వారా ఇతర దేశాల్లో చదువుతున్న విద్యార్థుల చెల్లింపులకు కూడా ఉపయోగపడతాయని చెప్పారు. కరోనా కారణంగా విదేశాల్లోని మన వారు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. భారత్ QR కోడ్ ద్వారా జారీ చేయడం ద్వారా ఈ-పేమెంట్స్ చెల్లింపులను అందరికీ సులభతరం చేయాలన్నారు.
రూ.2,000 నుండి రూ.5000 పెంపు
కొత్తగా జారీ చేసిన అన్ని కార్డులను డొమెస్టిక్ కార్డు నాట్ ప్రెజంట్ (CNP), కాంటాక్ట్ లెక్ ట్రాన్సాక్షన్స్ ఆప్షన్తో యాక్టివేట్ చేయాలన్నారు. ప్రస్తుతం ట్యాప్ అండ్ పేమోడ్ చెల్లింపులను పిన్ లేకుండా రూ.2,000 ట్రాన్సాక్షన్స్ వరకు అనుమతిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో దీనిని రూ.5,000కు పెంచాలని అసోచామ్ విజ్ఞప్తి చేసింది.
రూ.1.2 లక్షల కోట్లు అవసరం
దేశంలోని అన్ని సెక్టార్లు పుంజుకోవడానికి ప్రభుత్వం రూ.1 లక్ష కోట్ల నుండి రూ.1.2 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో భారత్కు దాదాపు 50 బిలియన్ డాలర వరకు చమురు బిల్లు ఆదా అవుతోందని చెప్పారు. దీంతో పాటు FRBM చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్నారు.
క్యాష్ ఫ్లో అవసరం
వ్యవస్థలో క్యాష్ ఫ్లోను సరియైన స్థాయిలో ఉంచేందుకు ప్రభుత్వానికి అప్పులు తీసుకోవడం అవసరమన్నారు. దీనికి FRBM చట్టం అడ్డుపడుతుందని, ఒకటి లేదా రెండేళ్ల వరకు ద్రవ్యోల్బణాన్ని మానిటర్ చేయడాన్ని ప్రభుత్వం నిలిపి వేయాలన్నారు. దీంతో వ్యవస్థలో లిక్విడిటీని బ్యాలెన్స్ చేయడం, చెక్ చేస్తుండడం వంటివి తప్పుతాయన్నారు. బ్యాంక్ లోన్లను రీస్ట్రక్చర్ చేసే వెసులుబాటు ఉండాలన్నారు. లాక్ డౌన్ వల్ల వ్యవస్థలో ఫైనాన్షియల్ ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఇది బ్యాంకుల ఎన్పీఏలు పెరిగేందుకు కారణమవుతుందని, అందరినీ ఇన్సాల్వెన్సీ చట్టం కిందకు తీసుకు రావడం కుదరదన్నారు. ఎకానమీ తిరిగి గాడిలో పడేంత వరకు బాసెల్ నిబంధనలు నిలిపివేయాలని కోరారు.