జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులే: ప్రభుత్వంపై రూ.300 కోట్ల భారం
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకునే బిల్లుకు శాసన సభ సోమవారం (డిసెంబర్ 16) ఆమోదం తెలిపింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవద్దంటూ 1997లో చేసిన చట్టానికి సవరణ చేసింది. అలాగే ఆర్టీసీ ఉద్యోగులను తీసుకునేలా ఈ చట్టాన్ని తీసుకు వచ్చారు.
ఏపీలో ఏ బస్సుకు ఎంత ఛార్జ్ పెరిగింది, ఆ బస్సులో పెరగలేదు: తిరుమలకు ఏకంగా రూ.20 పెంపు
ఆర్టీసీలో 51,488 మందికి ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రజా రవాణాశాఖలో ఉద్యోగులు కానున్నారు. విలీనం నేపథ్యంలో జీతాలు, ఇతర వ్యయాల రూపంలో నెలకు రూ.300 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,600 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది. ఆర్టీసీ కార్మికులకు బకాయిలు వెంటనే చెల్లిస్తారు. ఆర్టీసీ కార్మికులు అందరూ జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఉద్యోగులు పీటీడీలోకి విలీనమైన వెంటనే ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తారు.
ప్రస్తుతం రూ.3,688 కోట్ల తక్షణ చెల్లింపుల బాకీలు 2019-20, 2020-21 సంవత్సరాల్లో తీరిపోతే 2021-222 ఆర్థిక సంవత్సరం వరకు రూ.687 కోట్ల నికర మిగులు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆర్టీసీ విలీనం నేపథ్యంలో ప్రభుత్వంపై ఏడాదికి రూ.3,600 కోట్ల భారం పడుతుంది.
ఆర్టీసీ కార్మికులను ప్రజా రవాణా విభాగంలో (PTD) ఉద్యోగులుగా మారుతారు. ప్రజా రవాణా విభాగంలో ఏర్పాటు చేయనున్న కేడర్ వారీ పోస్టుల సంఖ్య ఇలా ఉండనుంది.. ఆపరేషన్స్ విభాగం 41,179, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ 7,005, పర్సనల్ డిపార్టుమెంట్ 822, ఫైనాన్స్ అండ్ స్టాటిస్టికల్ డిపార్టుమెంట్ 723, మెడికల్ డిపార్టుమెంట్ 86, పర్చేజ్ అండ్ స్పోర్ట్స్ 225, సెక్యూరిటీ వింగ్ 1,051, ఆఫీసర్స్ 397. మొత్తం 51,488 మంది ఉద్యోగులు ఉన్నారు.