కరోనా షాకింగ్, ఉద్యోగంలేక దరఖాస్తులు ఎంత ఎక్కువగా పెరిగాయో తెలుసా?
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. భారత ఆర్థిక వ్యవస్థపై కూడా పెను ప్రభావం పడింది. క్వికర్ జాబ్స్ రిపోర్ట్ ప్రకారం ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఏకంగా 48% పెరిగాయి. కరోనా కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. కొన్ని కంపెనీలు వేతనాల్లో కోత విధించాయి. మరిన్ని కంపెనీలు కొంతమంది ఉద్యోగులను వేతనం లేని సెలవులకు పంపించాయి. అయితే ఉద్యోగాలు పోయిన వారు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా తర్వాత దరఖాస్తులు భారీగా పెరిగాయి.
వేలాదిమంది ఐటీ ఉద్యోగులకు ఇకముందు మరింత గండం!
దరఖాస్తులు పెరిగాయి.. ఉద్యోగాలు తగ్గాయి
కరోనా దెబ్బతో పరిశ్రమలు మూతబడి, లక్షలాధి మంది ఉపాధి కోల్పోయారు. దీంతో కరోనా రాకముందు కంటే ఇప్పుడు 48 శాతం అధికంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని క్విక్కర్ జాబ్స్ పోర్టల్ రిపోర్ట్ వెల్లడించింది. అంతేకాదు, దరఖాస్తులలో, ఉద్యోగాల ఖాళీలలో భారీ వ్యత్యాసం ఉందని తెలిపింది. అంటే దరఖాస్తులు పెరుగుతుండగా, ఉద్యోగాలు శాతం మాత్రం తగ్గింది. మెట్రో నగరాల్లో ఇలా ఉద్యోగాల కోసం చాలా ఎక్కువ దరఖాస్తులు వస్తున్నట్లు తెలిపింది.
మెట్రోల్లో ఎక్కువ
మెట్రో ఏరియాలో వచ్చే దరఖాస్తులు పెద్ద ఎత్తున పెరిగినట్లు ఈ జాబ్ పోర్టల్ నివేదిక వెల్లడిస్తోంది. నాన్ మెట్రోలో కూడా పెరిగినప్పటికీ ఈ స్థాయిలో పెరగడం లేదని వెల్లడించింది. మార్చి 16వ తేదీ నుండి మే చివరి నాటికి, అంతకుముందు జనవరి నుండి మార్చి 15వ తేదీ నాటితో పోలిస్తే దరఖాస్తులు పెద్ద ఎత్తున పెరిగాయి. అయితే కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఏ రంగంలో ఎన్ని అప్లికేషన్స్ పెరిగాయంటే
IANS సర్వే రిపోర్ట్ ప్రకారం డేటా ఎంట్రీ, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, డ్రైవర్, టీచర్, మార్కెటింగ్, సేల్స్ తదితర విభాగాల్లో అధిక దరఖాస్తులు వచ్చాయి. కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని పేర్కొంది. విదేశాలలో ఉద్యోగాలు ఆశించేవారికి విమానయాన సంస్థ ఆంక్షలతో వారి ఆశలకు బ్రేక్ పడిందని తెలిపింది. డేటా ఎంట్రీ, బ్యాక్ ఆఫీస్ కోసం 115 శాతం, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ కోసం 139 శాతం, డ్రైవర్స్ కోసం 122 శాతం, టీచర్స్ కోసం 108 శాతం, మార్కెటింగ్ కోసం 179 శాతం, సేల్స్లో 187 శాతం పెరిగాయి.