Indian iphone: ప్రతి నాలుగు ఐఫోన్లలో ఒకటి భారత్ లోనే తయారీ.. ??
Indian iphone: ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యాపిల్ ఉత్పత్తులను మాత్రమే భారతీయులు వినియోగించేవారు. 2017 నుంచి మన దేశంలోనూ ఐఫోన్ అసెంబ్లింగ్ జరుగుతుండటం మొదలై.. మెల్లమెల్లగా దాదాపు 7 శాతం తయారీ ఇక్కడే జరుగుతోంది. దానిని 25 శాతానికి పెంచే యోచనలో యాపిల్ సంస్థ ఉన్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచనప్రాయంగా తెలిపారు.
పెట్టుబడుల స్వర్గధామం
యాపిల్ సంస్థ ఉత్పత్తుల్లో సింహభాగం చైనాలోనే తయారవుతాయి. అయితే అక్కడ నెలకొన్న కొవిడ్, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా.. వ్యాపారం సజావుగా సాగే అవకాశం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా పలు సంస్థలు ఇతర దేశాల వైపు చూస్తున్నాయి. పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న భారత్ వైపు ఆయా కంపెనీలు ఆకర్షితులవుతున్నాయి.
ఇండియాలో ప్రస్తుతం తక్కువ స్థాయిలో ఉత్పత్తులను తయారు చేస్తున్న సంస్థలు సైతం.. వ్యాపారాన్ని విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం యాపిల్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు.
చైనాకు ప్రత్యామ్నాయం భారత్
తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయ స్థాయిలో భారత్ నిలుస్తోందనడానికి యాపిల్ సంస్థ విజయగాథే నిదర్శనమని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సింగిల్ డిజిట్ తో ఉన్న యాపిల్ ప్రొడక్టుల ఉత్పత్తిని 25 శాతం వరకు పెంచాలని ఆ సంస్థ ఆలోచిస్తోందన్నారు. భారత్ లో తయారైన ఫోన్ మోడళ్లను ఇటీవల కంపెనీ విడుదల చేసిందని గుర్తుచేశారు. అయితే ఎప్పటిలోగా ఇది కార్యరూపం దాలుస్తుందో మాత్రం ఆయన వివరించలేదు.
యాపిల్ తో జతకట్టిన టాటా గ్రూపు
భారత్ లో మొదటగా 2017లో విస్ట్రాన్ ద్వారా ఐఫోన్ తయారీని యాపిల్ ప్రారంభించగా.. అనంతరం ఫాక్స్ కాన్ తో కలిసి స్థానికంగా తయారీకి కేంద్రం అనుమతించింది. రాబోయే రెండేళ్లలో తన శ్రామిక శక్తిని నాలుగు రెట్టు పెంచాలని ఫాక్స్ కాన్ యోచిస్తున్నట్లు సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు.
గత డిసెంబరులో మన దేశం నుంచి యాపిల్ ఉత్పత్తుల ఎగుమతులు 1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వెల్లడించారు. భారతీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూపు సైతం యాపిల్ తో జతకట్టనుండటంతో.. ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.