రియాల్టీ సెగ్మెంట్లో అపోలో: భారీ పెట్టుబడులతో పక్కా ప్లాన్
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో కుదుపునకు గురైన దేశీయ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. రెండేళ్ల పాటు దాదాపుగా స్తంభించిపోయిన ఈ రంగం- క్రమంగా ఊపందుకుంది. నిర్మాణ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. కోవిడ్ కాలంలో సంభవించిన నష్టాలను పూడ్చుకోవడానికి ఈ రంగంలో ఉన్న బిగ్ షాట్స్ అందరూ దృష్టి సారించారు.
రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎవర్ గ్రీన్గా భావిస్తుంటాయి మార్కెట్ వర్గాలు. భూముల క్రయ విక్రయాలు, నిర్మాణ రంగంతో ముడిపడి ఉన్న ఏ రంగం కూడా దెబ్బ తినబోదనే అభిప్రాయాలు ఉంటాయి. వాటన్నింటినీ పటాపంచలు చేసింది కరోన వైరస్. ఈ ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించడం వల్ల రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ తీవ్రంగా ప్రభావితమైంది. నిర్మాణ పనులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి.
ఈ కష్టకాలాన్ని అధిగమించింది రియల్ ఎస్టేట్ రంగం. దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఏర్పడటం మొదలయ్యాక మళ్లీ పుంజుకొంది. మునుపటి స్థితికి చేరుకుంది. అతి కొద్దిరోజుల్లోనే పూర్వవైభవాన్ని సంతరించుకుంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బడా కంపెనీలు మళ్లీ దీనిపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్.. ఈ సెగ్మెంట్లో భారీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. దశలవారీగా ఒక బిలియన్ డాలర్లను ఇందులో ఇన్వెస్ట్ చేయనుంది.
ఇందులో 750 మిలియన్ డాలర్ల మొత్తాన్ని రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లోకి మళ్లించాలని అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సంస్థ భాగస్వామి నిపున్ సాహ్నీ చెప్పారు. మిగిలిన మొత్తాన్ని కమర్షియల్ డెవలప్మెంట్స్లో కేటాయించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కోవిడ్ పాండమిక్ నుంచి దేశీయ రియాల్టీ సెగ్మెంట్ అతి వేగంగా కోలుకుందని, రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు.