యాపిల్ లాంటి ఛాన్స్: సౌత్లో ఐఫోన్ల తయారీ కంపెనీ పెగాట్రాన్ పాగా: ఆ మూడు రాష్ట్రాల మధ్య పోటీ
చెన్నై: పారిశ్రామిక దిగ్గజం యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల తయారీ యూనిట్ దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటు కానుంది. సుమారు 1,100 కోట్ల రూపాయలను ప్రారంభ పెట్టుబడి పెట్టుబోతున్నట్లు ప్రకటించింది. యాపిల్ కాంట్రాక్ట్ కంపెనీ పెగాట్రాన్ ఈ యూనిట్ను నెలకొల్పబోతోంది. తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్ జెయింట్ కంపెనీ ఇది. దక్షిణాదిన అడుగు పెట్టడానికి సన్నాహాలను చేపట్టడంతో మూడు రాష్ట్రాల ప్రభుత్వాల్లో కదలిక ఏర్పడింది. పెగాట్రాన్ పెట్టుబడులను ఆకర్షించడానికి పోటీ పడుతున్నాయి. ఈ రేసులో తమిళనాడు ముందంజలో ఉంటోంది.
తమిళనాడు సీఎంతో భేటీ..
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పెగాట్రాన్ కంపెనీ యాజమాన్యానికి భారీ రాయితీలను ప్రకటించాయి. ఈ రేసులో ఏపీ వెనుకబడింది. తమిళనాడులోని ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు ఆకర్షణీయంగా ఉండటం వల్ల ఐఫోన్ల తయారీ యూనిట్ అక్కడే ఏర్పాటయ్యే అవకాశాలు లేకపోలేదు. పెగాట్రాన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చియు-టాన్ లిన్ సారథ్యంలోని ప్రతినిధుల బృందం ఇదివరకే పళనిస్వామితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాంచీపురం జిల్లాలో స్థలం..
పెగాట్రాన్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే.. కాంచీపురం జిల్లా వళ్లకొట్టై ప్రాంతంలో అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని, దీనికోసం సంబంధిత స్థలాన్ని డినోటిఫై చేయాలని కూడా నిర్ణయించినట్లు తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి సీ సంపత్ పేర్కొన్నారు. నిజానికి- పెగాట్రాన్ కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్.. ఇదివరకే చెన్నైలో ఏర్పాటైంది. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఓ కొలిక్కి వస్తే.. వచ్చే ఏడాది ద్వితీయార్థం లేదా 2022 ప్రథమార్థంలో పెగాట్రాన్ కంపెనీ తన ప్రొడక్షన్ను ప్రారంభించేలా ఏర్పాట్లు సాగుతున్నాయని చెబుతున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రితోనూ భేటీకి ఛాన్స్?
త్వరలో ఇదే ప్రతినిధుల బృందం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను కలుసుకుంటుందని తెలుస్తోంది. పెగాట్రాన్ సంస్థను పెట్టుబడులను ఆకర్షించడానికి తమ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోందని కర్ణాటక పారిశ్రామికాభివృద్ధి సంస్థ అధికారులు వెల్లడించారు. బెంగళూరు నగర శివార్లలో ఆ సంస్థ కోసం 50 ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. పెగాట్రాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని ఎప్పుడు కలుస్తారనేది ఇంకా నిర్ధారణ కాలేదని కర్ణాటక పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులను ఉటంకిస్తూ.. ఓ ఆంగ్ల దినప్రతిక వెబ్సైట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
భారీగా రాయితీలు..
మూల పెట్టుబడిలో 25 శాతం రాయితీని ప్రకటిస్తామని, ప్లాంట్, మిషనరీల్లో స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఇచ్చే ప్రతిపాదన కూడా ఉందని కర్ణాటక అధికారులు వెల్లడించారు. అలాగే-ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్ఐ)లో రాయితీలను ఇవ్వడానికి కూడా యడియూరప్ప అంగీకరించారని చెప్పారు. కొత్తగా రూపొందించిన ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ-2020 ప్రకారం.. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేలా అనేక రాయితీలను కల్పించామని, పెగాట్రాన్ సంస్థతో సంప్రదింపులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
వెనుకంజలో ఏపీ
పెగాట్రాన్ కంపెనీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ వెనుకంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. కడపజిల్లాలోని కొప్పర్తి వద్ద ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక, ఎలక్ట్రానిక్ హబ్లో ఐఫోన్ కంపెనీ పెట్టబడులను పెట్టడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అవి పెద్దగా ఫలితం ఇస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లోని శ్రీసిటీ సెజ్లో ఐఫోన్ల తయారీ యూనిట్ను నెలకొల్పడానికి పెగాట్రాన్ ఆసక్తి చూపకపోవం వల్ల ప్రత్యామ్నాయంగా కొప్పర్తి హబ్ను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు ఎంతమేర సఫలం అవుతాయనేది ఆసక్తి రేపుతోంది.