CM Jagan: లబ్ధిదారుల ఖాతాల్లో రూ.87.30 కోట్లు జమ చేసిన ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలతో దూసుకెళ్తోంది. తాజాగా ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా కిందృ రూ.87.30 కోట్ల డబ్బును పెళ్లి కూతుళ్ల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. డిగ్రీ వరకు పేద పిల్లల చదువుల భారం ప్రభుత్వమే భరిస్తుందని జగన్ హామీ ఇచ్చారు. పేదవారు చదువుకోవడం కోసమే అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు తీసుకొచ్చామని తెలిపారు.
ఈ పథకాలను ఉపయోగించుకుని కనీసం డిగ్రీ వరకు చదువుకోవాలన్నారు. అమ్మాయి చదువుకోవడానికి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలకు కనీసం పదో తరగతి అర్హతగా నిర్ణయించినట్లు గుర్తు చేశారు. చదువు అనే దివ్యాస్త్రంతో పేదరికాన్నిజయించవచ్చని జగన్ స్పష్టం చేశారు. జనవరి-మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించినట్లు వివరించారు.
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాల కింద ఇప్పటి వరకు 16,668 మంది లబ్ధిదారులు లబ్ధి పొందారు. ఈ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.125.50 కోట్లు జమ చేసింది. నిధుల విడుదల సందర్భంగా కొత్త జంటలతో సీఎం జగన్ ఆన్ లైన్ లో ముచ్చటించారు. పదో తరగతి చదివితేనే కళ్యాణమస్తు, షాదీతోఫా లభిస్తుందన్నారు.
గత ప్రభుత్వం 17,709 మంది జంటలకు తక్కువ మొత్తం సాయం చేశారన్నారు. గత ప్రభుత్వం దాదాపుగా రూ.70 కోట్లు ఎగ్గొట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద జంటలకు మంచి జరగాలనే తపన, తాపత్రయంతో పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. 15 ఏళ్ల వయసుకు పదో తరగతి అయిపోతే..18 ఏళ్ల వరకు ఆగాలి కాబట్టి..ఎలాగు మన ప్రభుత్వం పిల్లలను బడిబాట పట్టించేందుకు అమ్మ ఒడి కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు.
గతంలో ఎస్సీలకు రూ.40 వేలు ఇచ్చారని..తమ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ప్రకటించినట్లు చెప్పారు. బీసీలకు రూ.50 వేల కోట్లు, మైనారిటీలకు రూ.లక్ష కోట్ల వరకు ఇస్తున్నామని తెలిపారు.