పేటీఎంలో వాటా విక్రయానికి చైనా గ్రూప్ సన్నాహాలు? కొట్టిపారేసిన కంపెనీలు
డిజిటల్ చెల్లింపుల దిగ్గజసంస్థ పేటీఎంలో ఉన్న 30 శాతం వాటా విక్రయించేందుకు చైనా ఫిన్టెక్ సంస్థ యాంట్ గ్రూప్ సన్నాహాలు చేస్తోందని వార్తలు వచ్చాయి. భారత్-చైనా మధ్య దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నిబంధనలు కఠినంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో యాంట్ గ్రూప్.. పేటీఎం నుండి బయటకు వెళ్లాలని చూస్తోందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై యాంట్ గ్రూప్ కూడా స్పందించింది.
SBI యోనో యాప్లో ఎర్రర్, కస్టమర్ల తీవ్ర అసహనం: ట్విట్టర్లో వెల్లువ..
పేటీఎంలో యాంట్ గ్రూప్ వ్యాల్యూ ఎంతంటే
ఏడాది క్రితం జరిగిన ప్రయివేటు నిధుల సమీకరణ సమయంలో పేటీఎం వ్యాల్యూను 16 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.1.2 లక్షల కోట్లు)గా ఉందని లెక్కగట్టారు. పేటీఎంలో సాఫ్టుబ్యాంక్ గ్రూప్, మరిన్ని సంస్థల పెట్టుబడులు ఉన్నాయి. దీని ప్రకారం పేటీఎంలో యాంట్ గ్రూప్ వాటా వ్యాల్యూ 4.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మన కరెన్సీలో రూ.36,000 కోట్లుగా ఉంటుందని అంచనా. అయితే ప్రస్తుతం ఈ వ్యాల్యూ 5 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చునని అంచనా. అయితే ఈ వాటా విక్రయ వార్తలపై యాంట్, పేటీఎం గ్రూప్స్ స్పందించాయి. విక్రయం వార్తలను కొట్టి పారేశాయి.
చర్చలు జరగలేదు...
వాటా విక్రయానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదని పేటీఎం ప్రతినిధులు తెలిపారు. విక్రయానికి సంబంధించిన వార్తలు రూటర్స్లో వచ్చాయి. అయితే 'రూటర్స్ స్టోరీ అవాస్తవం' అని యాంట్ గ్రూప్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ స్టార్టప్ నవంబర్ 2019న 1 బిలియన్ డాలర్లు సమీకరించింది.
షేర్ల నమోదు రద్దు
ప్రపంచంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా భావించిన యాంట్ గ్రూప్ షేర్ల నమోదు గత నెలలో అనూహ్యంగా రద్దయిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు 37 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ నిలిచిపోయింది. పేటీఎంలో యాంట్ గ్రూప్ వాటా విక్రయానికి ఇది కూడా కారణమని విశ్లేషకులు భావించారు. పలు దేశాల్లో ఈ-వ్యాలెట్ సంస్థలకు యాంట్ గ్రూప్ ఆర్థిక మద్దతును నిలిపివేసింది. పేటీఎంలో వాటా విక్రయం వార్తలకు ఇది కూడా ఓ కారణం. చైనా నుండి వచ్చే పెట్టుబడులపై నిబంధనను భారత్ కఠినతరం చేయడం, టెన్సెంట్, అలీబాబా, బైట్ డ్యాన్స్ల యాప్స్పై నిషేధం విధించింది.