ఆర్కామ్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలగిన అనిల్ అంబానీ
తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) డైరెక్టర్ పదవికి అంబానీ బ్రదర్స్లో ఒకరైన అనిల్ అంబానీ శనివారం రాజీనామా చేశారు. అనిల్ అంబానీతోపాటు నలుగురు డైరెక్టర్లు ఛాయా విరాని, రైనా కరానీ, మంజరి కకేర్, సురేష్ రంగాచార్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీ నష్టాలను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. బకాయిలు చెల్లించలేకే ఈ కంపెనీ తన కార్యకలాపాలను నిలిపివేసింది.
మరోవైపు ఆర్కామ్ దివాలా ప్రక్రియ కూడా మొదలైంది. కంపెనీకి చెందిన ఆస్తులను ఐబీసీ నేతృత్వంలో అమ్మకానికి ఉంచగా, ఈ ఆస్తులను కొనుగోలు చేయాలని చూస్తోన్న కంపెనీల్లో అనిల్ అంబానీ సోదరుడు ముఖేశ్ అంబానీ నేతృత్వంలో విజయవంతంగా కొనసాగుతోన్న రిలయన్స్ జియో కూడా ఉంది.
ఇక కంపెనీ డైరెక్టర్, సీఎఫ్ఓ వి.మణికంఠన్ గతంలోనే రాజీనామా చేశారు. తాజాగా డైరెక్టర్ పదవులకు అనిల్ అంబానీతోపాటు మరో నలుగురు రాజీనామాలు సమర్పించాగా, బీఎస్ఈకి ఇచ్చిన నోటీసులో కంపెనీ ఈ మేరకు పేర్కొంది. వీరి రాజీనామాలను కంపెనీ రుణదాతల కమిటీకి నివేదిస్తామని ఆర్కామ్ తెలిపింది.
సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.30,142 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. నిజానికి గత ఏడాది ఇదే త్రైమాసికానికి ఆర్కామ్ రూ.1,141 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పెక్ర్టమ్ వినియోగ చార్జీలు, లైసెన్సు ఫీజుల చెల్లింపు(ఏజీఆర్) కోసం రూ.28,314 కోట్లు కేటాయించడం వల్లే ఆర్కామ్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో కంపెనీ దివాలా అంచున నిలిచింది.
దేశంలోని టెలికాం కంపెనీలు వరుసగా భారీ నష్టాలను ప్రకటిస్తుండటం గుబులు రేపుతోంది. ఇక లైసెన్స్ ఫీజు, స్పెక్ర్టమ్ బకాయిలకు కేటాయింపుల అనంతరం వొడాఫోన్ ఐడియా కూడా జులై-సెప్టెంబర్ కాలానికి రూ.50,921 కోట్ల నష్టాలు ప్రకటించగా, మరో ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ కూడా రూ.23,000 కోట్ల నష్టాలను నమోదు చేయడం గమనార్హం.