EODB: నిలబెట్టుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మైనస్!
సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-EODB)లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక ప్రోత్సాహక శాఖ (DPIIT) విడుదల చేసిన EODB వార్షిక ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్ 3లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో, తెలంగాణ మూడో స్థానంలో నిలవగా, ఉత్తర ప్రదేశ్ గత ఏడాదితో పోలిస్తే 10 ర్యాంకులు ఎగబాకి రెండో స్థానంలోకి వచ్చింది.
2019 మార్చి 31వ తేదీ వరకు ఉన్న విధానాలపై ఈ సర్వే జరిగింది. ఆంధ్రప్రదేశ్ వరుసగా నాలుగో ఏడాది టాప్ 10లో నిలిచిన ఘనత సాధించింది. నాలుగేళ్లుగా DPIIT ఈ ర్యాంకులు ఇస్తుండగా, తొలిసారి ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మూడుసార్లు తొలి స్థానం దక్కించుకుంది. తెలంగాణ మొదటి ఏడాది తప్ప మిగతా మూడుసార్లు మొదటి మూడు స్థానాల్లో ఉంది.
దారుణంగా దెబ్బతిన్నాం, ఇదిగో... భారత ఆర్థిక వ్యవస్థ V షేప్ రికవరీ
నిలబెట్టుకున్న ఏపీ, తెలంగాణ మైనస్
టాప్ 10లో వరుసగా ఆంధ్రప్రదేశ్ (1వ స్థానం), ఉత్తర ప్రదేశ్ (2), తెలంగాణ (3), మధ్యప్రదేశ్ (4), జార్ఖండ్ (5), చత్తీస్గఢ్ (6), హిమాచల్ ప్రదేశ్ (7), రాజస్థాన్ (8), పశ్చిమ బెంగాల్ (9), గుజరాత్ (10వ స్థానం)లో ఉన్నాయి. ఏపీ గతంలోను మొదటి ర్యాంక్ సాధించి, ఇప్పుడు దానిని నిలబెట్టుకుంది. యూపీ 10 ర్యాంకులు ఎగబాకింది.
తెలంగాణ 1 ర్యాంకు దిగజారింది. మధ్యప్రదేశ్ 3 ర్యాంకులు, హిమాచల్ ప్రదేశ్ 9 ర్యాంకులు, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లు ఒక ర్యాంకు చొప్పున ఎగబాకాయి. జార్ఖండ్ ఒక ర్యాంకు, గుజరాత్ 5 ర్యాంకులు దిగజారాయి. చత్తీస్గఢ్ 6వ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మంచి ర్యాంకింగ్ కోసం తెలంగాణ పలు సంస్కరణలు చేపట్టింది. పారిశ్రామిక అనుమతుల విషయంలో టీఎస్ఐపాస్ను అమలు చేసి, సింగిల్ విండో విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, అడవులు, పరిశ్రమలు, విద్యుత్లో సంస్కరణలు చేపట్టింది.
వీటి ఆధారంగా ర్యాంకులు
పారదర్శకత కోసం సమాచార లభ్యత, కార్మిక నిబంధనలు, నిర్మాణ అనుమతులు, సింగిల్ విండో విధానం, రంగాల వారీగా ప్రత్యేకతలు, తనిఖీ విభాగాలు, పన్ను చెల్లింపులు, పర్యావరణ రిజిస్ట్రేషన్లు, యుటిలిటీ అనుమతులు పొందడం, భూపరిపాన, ఆస్తి, కాంట్రాక్టుల అమలు, భూలభ్యత, కేటాయింపులు తదితర వాటి ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. ర్యాంకుల నిర్ణయంలో 180 పాయింట్లను పరిగణలోకి తీసుకున్నారు.
భారత్ ముందుకు
మరోవైపు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తాజా నివేదికలో భారత్ స్థానం 63 నుంచి 14వ స్థానానికి ఎగబాకినట్లు కేంద్రమంత్రి చెప్పారు. ఈ ర్యాంకుల వల్ల ప్రపంచంలో దేశం స్థాయి మెరుగుపడుతుందన్నారు. కరోనా కష్టకాలంలోను దేశంలోకి పెట్టుబడులు భారీగా వచ్చినట్లు కేంద్రఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న తెలిపారు. ఏప్రిల్-జూలై మధ్య మన దేశంలోకి 20 బిలియన్ డాలర్ల మేర FDIలు వచ్చాయి.