ఇదీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, అన్నీ తెలంగాణలోనే: 'తలసరి' లెక్క చెప్పిన జగన్
అమరావతి: వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాను గుర్తు చేసింది. హోదా ఇవ్వాలని సిఫార్సు చేయాలని కోరింది. విభజన నేపథ్యంలో ఏపీ తీవ్ర ఆర్థిక కష్టాలలో ఉందని, అవసరాలు తీర్చేందుకు సాయం చేయాలని, హోదా కోసం సిఫార్స్ చేయాలని ఆర్థిక సంఘానికి జగన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 2014 మార్చి 2వ తేదీన నాటి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని, ఆ తర్వాత ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదని పేర్కొన్నారు.
వారికి షాకిచ్చిన జగన్ ప్రభుత్వం: అమరావతిలో ఆ ప్లాట్ల కేటాయింపు రద్దు, కారణమిదే
కేంద్రానికి సిఫార్సు చేయండి
ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్, కార్యదర్శ అరవింద్ మెహతా, రవి కోటా తదితర సభ్యులతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హోదా ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరారు. విభజన హామీలు నెరవేర్చేందుకు కేంద్రంలో ఒక యంత్రాంగం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏపీ తలసరి చాలా తక్కువగా ఉంది, నిరుద్యోగం ఎక్కువ
తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని, తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,05,696గా ఉండగా, ఏపీ తలసరి రూ.1,64,025గా ఉందని చెప్పారు. 15 నుంచి 29 ఏళ్ల వయస్సులోని వారిలో నిరుద్యోగం 22.8%గా ఉంటే దేశవ్యాప్తంగా 20.6%గా ఉందని చెప్పారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రూ.5,127 కోట్లు రావాల్సి ఉందని, దీనిపై వడ్డీ రూ.604 కోట్లు కూడా ఇంత వరకు అందలేదన్నారు.
అన్నీ తెలంగాణలోనే...
9వ షెడ్యూల్లోని ఆస్తుల విభజన ఇంతవరకు జరగలేదని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకు వచ్చారు. షెడ్యూల్ 10లోని ఆస్తులు 142 ఉంటే అందులో తెలంగాణకు 107, ఏపీకి 15 మాత్రమే వచ్చాయని, ఇందులో 20 ఆస్తులు తెలంగాణ, ఏపీ చేతుల్లో ఉమ్మడిగా ఉన్నాయన్నారు. ఏపీ భవన్ విభజన ఇంకా జరగలేదన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇక్రిశాట్ వంటి సంస్థలు హైదరాబాదులో ఉన్నాయని, BHEL, ESIL, HCL వంటి కేంద్ర ప్రభుత్వం సంస్థలు కూడా తెలంగాణలో ఉన్నాయని, దీంతో ఉద్యోగ అవకాశాలు తగ్గుముఖం పట్టాయన్నారు.
ప్రాజెక్టులు నిధులివ్వండి, రుణాలు మాఫీ చేయండి
పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా ప్రకారం రూ.55,548 కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు, పునరావాసం కోసం రూ.16వేల కోట్లు విడుదల చేయాలన్నారు.
- వెనుకబడిన జిల్లాలకు రూ.24,350 కోట్లు రావాలని, ఇప్పటి వరకు రూ.1,050 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు.
- రామాయపట్నం పోర్టుకు సాయం చేయాలని, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు చట్టంలో పేర్కొన్నట్లు అమలు చేయాలన్నారు.
- కడప స్టీల్ ప్లాంటును ప్రకటించాలని కోరారు.
- కేంద్ర రుణాలు రూ.22,733 కోట్లు మాఫీ చేయాలని కోరారు.
- 2020-25 వరకు స్థానిక సంస్థలకు వనరుల లోటు కింద రూ.40,543 కోట్లు ఇచ్చేలా సిఫార్సు చేయాలని కోరారు.
- విభజన వల్ల పారిశ్రామిక, సేవా రంగం వాటా వరుసగా 25.2 శాతం నుంచి 23.4 శాతానికి, 44.6 శాతం నుంచి 43 శాతానికి పడిపోయిందన్నారు.
- రెవెన్యూ వాటా ఏపీలో 46 శాతంగా ఉంటే తెలంగాణలో 54 శాతంగా ఉందన్నారు.
- రెవెన్యూ లోటు కింద రూ.18,969 కోట్లు ఇవ్వాలని కోరారు. రూ.3,979 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు.
పథకాలకు నిధులివ్వండి
రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, పెన్షన్ పెంపు, అమ్మఒడి, విద్యా దీవెన, పేదలందరికీ ఇళ్లు, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, మద్యనిషేధం లాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నామని, వీటికి కేంద్రం తగిన సాయం చేసేలా సిఫార్సు చేయాలని జగన్ కోరారు. 15వ ఆర్థిక సంఘం వర్తించే కాలానికి స్థానిక సంస్థలకు రూ.40,543 కోట్లు సిఫార్స్ చేయాలన్నారు. పరిశ్రమలకు రూ.4,000 కోట్ల రాయితీలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్నారు. విభజన హామీలు, సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, దీంతో ఏపీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, దీని నుంచి బయటపడాలంటే కేంద్రం ఉదారంగా నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
విభజన హామీల అమలుకు కమిటీ
కాగా, ఏపీ విభజన చట్టంలోని హామీల అమలుకు ఓ కమిటీ ఉంటే బాగుంటుందని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ అభిప్రాయపడ్డారు. నీతి అయోగ్లో ఏపీ సమస్యలపై ఒకరిద్దరు సభ్యులు ఉంటే మంచిదన్నారు. ప్రధానిని సీఎం కలిసినప్పుడు దీనిపై విన్నవించాలన్నారు.