భారత మార్కెట్లో ఐపీవో జోరు, చిన్న ఇన్వెస్టర్ల కోసం సెబీ కొత్త రూల్స్!
భారత మార్కెట్లో ప్రస్తుతం ఐపీవో దూకుడు కనిపిస్తోంది. గత ఏడాది నుండి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. కొత్త డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. తమ చేతిలో మొత్తాన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఐపీవోలు దూసుకు వస్తున్నాయి. ఐపీవోల ద్వారా సమీకరించిన డబ్బును కంపెనీలు ఎలా ఖర్చు పెడుతున్నాయో పూర్తిగా తెలియదు. ఐపీవోల ద్వారా సమీకరించిన మొత్తాన్ని ఇతర అంశాలకు ఖర్చు చేసి, ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే పెద్ద ఇన్వెస్టర్లు బయటపడగలరు.
కానీ చిన్న ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ. ఈ నేపథ్యంలో చిన్న ఇన్వెస్టర్ల రక్షణ కోసం ఐపీవోలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి కొన్ని నిబంధనలను ప్రతిపాదించింది. ముఖ్యంగా పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల వినియోగంలో జవాబుదారీతనం, పారదర్శకతను తీసుకు వచ్చే దిశగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
నిధుల సమీకరణ
యాంకర్ ఇన్వెస్టర్ల పైన కూడా కొన్ని షరతులు విధించాలని భావిస్తోంది సెబి. ఐపీవో కొత్త ప్రతిపాదనలకు సంబంధించి నవంబర్ 30వ తేదీ వరకు అభిప్రాయాలు తెలపాలని పరిశ్రమ వర్గాలను కోరింది.
సమీకరించిన నిధుల్లో 35 శాతం కంపెనీ ఇనార్గానిక్ వృద్ధికి, సాధారణ కార్పోరేట్ అవసరాలకు వినియోగించుకోవచ్చు.
టెక్నాలజీ కంపెనీలు కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం కొత్త కస్టమర్లను ఆకర్షించడం కోసం లేదా కొత్త సంస్థల్లోకి విస్తరించేందుకు నిధులను సమీకరించాలి.
లాక్-ఇన్ పీరియడ్
ఏదైనా కంపెనీ గుర్తించదగిన ప్రమోటర్లు లేకుంటే అందులో కీలక వాటాదారులు తమ వద్ద ఉన్న షేర్లలో యాభై శాతానికి మించి పబ్లిక్ ఇష్యూలో విక్రయించవద్దు. ఒక కంపెనీలో 20 శాతం కంటే ఎక్కువ షేర్లు ఉన్నవారిని కీలకవాటాదారుగా పరిగణిస్తారు.
కీలక వాటాదారులు ఐపీవోలో షేర్లను విక్రయించిన తర్వాత మరో ఆరు నెలల వరకు మరోసారి షేర్లను విక్రయించవద్దు. అంటే ఆరు నెలల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.
యాంకర్ ఇన్వెస్టర్ల కాలపరిమితి
యాంకర్ ఇన్వెస్టర్లలో కనీసం 50 శాతం మంది 90 రోజులకు పైగా తమ షేర్లను అట్టిపెట్టాలి. ప్రస్తుతం ఈ కాలపరిమితి 30 రోజులు.ఐపీవోలో సమీకరించిన నిధులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.జీసీపీ నిధుల వినియోగాన్ని క్వార్టర్లీ మానిటరింగ్ ఏజెన్సీ నివేదికలో పేర్కొనాలి. ఐపీవోల పరిమాణం భారీగా ఉంటున్న నేపథ్యంలో ఈ నిధులు కీలకంగా పరిగణించాలి.
కొత్త లిస్టింగ్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఇచ్చే రుణాలను రూ.1 కోటికి పరిమితం చేయాలనే ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఆర్బీఐ తెచ్చిన ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1, 2022 నుండి అమలులోకి రావొచ్చు.