US Food Banks: అమెరికన్ల ఆకలి కేకలు.. ఫుడ్ బ్యాంకుల వద్ద ప్రజల క్యూ.. మాంద్యం మెుదలైందా..?
US Food Banks: అమెరికాలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. మాంద్యం భయాలతో అమెరికన్లు ముందస్తు జాగ్రత్త చర్యలకు దిగుతున్నారు. విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరైన అమెరికన్లు తమ కుటుంబాలను పోషించుకోవడానికి హ్యాండ్అవుట్ల వైపు మొగ్గు చూపడంతో US చుట్టూ ఉన్న ఫుడ్ బ్యాంక్ల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. కిరాణా ఖర్చులతో పాటు గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో ఈ చర్యలకు దిగుతున్నారు. చాలా మంది ప్రజలు మొదటిసారిగా స్వచ్ఛంద ఆహారాన్ని కోరుకుంటున్నట్లు స్థానిక మీడియా కథనాల ప్రకారం తెలుస్తోంది. దీనికోసం చాలా మంది ప్రజలు కాలినడకన ఫుడ్ బ్యాంకులకు వస్తున్నారు.
ఫుడ్ బ్యాంకుల వద్ద క్యూలు..
అమెరికాలో ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అమెరికాలో ఏప్రిల్ 2020 నుంచి గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి.మహమ్మారి వల్ల షట్డౌన్ల తర్వాత ప్రజలు తిరిగి పనిలోకి రావడంతో కొంత ఉపశమనం పొందడం ప్రారంభించిన ఫుడ్ బ్యాంక్లపై మళ్లీ ప్రెజర్ పెరిగింది. కరోనా తరువాత ఇతర రాయితీలు సైతం దాదాపుగా నిలిచిపోయాయి. ఈ తరుణంలో ఆహాదం దొరకటం చాలా ఇబ్బందిగా మారిందని ఒక అమెరికన్ కుటుంబం తెలిపింది. మరి కొందరు పెరిగిన గ్యాస్ ధరల కారణంగా పొరుగు వారితో కలిసి వంట చేసుకోవటం, ఖర్చు షేర్ చేసుకోవటం వంటివి చేస్తున్నారు.
జీతాల కంటే ఖర్చు పెరిగింది..
ఇదే సమయంలో అమెరికా వ్యాప్తంగా ఫుడ్ బ్యాంకులకు డిమాండ్ భారీగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రతి రోజు ఈ ఆహార సెంటర్లకు 900 కుటుంబాలు సగటున వస్తున్నాయని వారు తెలిపారు. ఇలా అనేక ప్రాంతాల్లోని బ్యాంకులు వేల మందికి ఆహారాన్ని అందిస్తున్నాయి. కరోనా తరువాత పెరిగిన జీతాల కంటే ద్రవ్యోల్బణం వల్ల ఖర్చులు ఎక్కువయ్యాయని అనేక మంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సహాయం ఇలా..
ట్రంప్ పరిపాలన సమయంలో.. USDA అనేక బిలియన్ల డాలర్ల విలువైన పంది మాంసం, యాపిల్స్, డైరీ, బంగాళాదుంపలు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ఇది చాలా వరకు ఆహార బ్యాంకులకు ఇచ్చింది. సుంకాలు, US వాణిజ్య భాగస్వాముల ఇతర పద్ధతుల వల్ల నష్టపోయిన అమెరికన్ రైతులకు సహాయం చేయడానికి రూపొందించబడిన "ఆహారం కొనుగోలు & పంపిణీ కార్యక్రమం" ఆ తరువాత ముగిసింది. 2019 ఆర్థిక సంవత్సరానికి 1.2 బిలియన్ డాలర్లు, 2020 ఆర్థిక సంవత్సరానికి మరో 1.4 బిలియన్ డాలర్లు ఇందుకోసం వినియోగించబడ్డాయి. అయితే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం పౌరులకు ఉపశమనం కలిగించేందుకు ఎలాంటి చర్యలతో ముందుకు వస్తుంది అనే అంశం వేచి చూడాల్సిందే. మాంద్యం ముదిరితే పరిస్థితులు ఎలా మారతాయో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.