Amazon: తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. 36,300 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న అమెజాన్..
తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థ అమెజాన్ ముందుకొచ్చింది. తెలంగాణలో వచ్చే ఏడేళ్లలో 36,300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు అంగీకరించింది. ఇప్పటికే హైదరాబాద్ నగర పరిసరాల్లోని చందన్వెల్లి, ఫ్యాబ్ సిటీ, ఫార్మాసిటీలో అమెజాన్ మూడు డేటా సెంటర్లు ఏర్పాటు చేసింది. వీటి మొదటి దశ పూర్తికాగా ఇప్పటికే వినియోగదారులకు పూర్తి స్థాయిలో క్లౌడ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
అమెజాన్ వెబ్ సర్వీస్
అమెజాన్ వెబ్ సర్వీస్ విస్తరణ, అదనపు పెట్టుబడిపై మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు . అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్ లో దావోస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలోకి వస్తున్న అతిపెద్ద ఎఫ్డీఐలలో ఇదొకటని చెప్పారు. ఇ-గవర్నెన్స్, హెల్త్కేర్, పురపాలక కార్యకలాపాలను మెరుగుపరచడానికి అమెజాన్తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయడం ద్వారా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లకు మరింత క్లౌడ్ రీజియన్లను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు. అమెజాన్ భారీ పెట్టుబడులతో డేటా సెంటర్ ప్రధాన కేంద్రంగా తెలంగాణ మారుతుందన్నారు.
మైక్రోసాఫ్ట్
అటు మైక్రోసాఫ్ట్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ తెలంగాణలో మరో రూ.16,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్లో మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. దావోస్లో జరుగుతున్న 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం' సమావేశాల్లో ఈ ప్రకటన చేసింది.
డాటా సెంటర్లు
ఇప్పటికే 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మైక్రోసాఫ్ట్.. తాజాగా మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. దీంతో హైదరాబాద్ లో 6 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. కాగా ఒక్కో డాటా సెంటర్ సామర్థ్యం 100 మెగావాట్లు కాగా, దశలవారీగా మైక్రోసాఫ్ట్ వీటి కార్యకలాపాలను మొదలు పెట్టనుంది.