నగదు సరఫరాపై ఆర్బీఐ నియంత్రణకు దెబ్బ: క్రిప్టోపై దువ్వూరి సుబ్బారావు
క్రిప్టో కరెన్సీపై ఆందోళన వ్యక్తం చేసే ఆర్థికవేత్తల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు క్రిప్టోలు వద్దని అభిప్రాయపడ్డారు. వాటితో ఆర్బీఐ పట్టుకు ముప్పు ఉంటుందన్నారు. క్రిప్టో కరెన్సీని అనుమతిస్తే ద్రవ్య, పరపతి విధానాల పైన ఆర్బీఐ పట్టు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నగదు సరఫరా, ద్రవ్యోల్భణ నిర్వహణ అదుపు తప్పుతాయని చెప్పారు. ఎన్ఎస్ఈ, న్యూయార్క్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ వెబినార్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్రిప్టోకు అనుమతివ్వడం ద్వారా అంతిమ రుణదాతగా ఉన్న ఆర్బీఐకి ఉన్న ప్రాధాన్యతను దిగజార్చడం సరికాదని తెలిపారు. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయన్నారు.
పటిష్టమైన డేటా పరిరక్షణ చట్టాలు
మూలధన నియంత్రణలు ఉన్నందున సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (CBDC)ని జారీ చేయడానికి అంత బలంగా ఉండకపోవచ్చునని దువ్వూరి సుబ్బారావు అన్నారు. డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరణతో మన దేశంలోను కరెన్సీ నోట్లకు కాలం చెల్లుతోందన్నారు. కరోనాతో తలెత్తిన లాక్ డౌన్ కారణంగా ఇటీవల దేశంలో కరెన్సీ నోట్ల చలామణి పెరిగిందన్నారు. పటిష్టమైన డేటా పరిరక్షణ చట్టాలు ఉంటే తప్ప, ఆర్బీఐ తన సొంత డిజిటల్ కరెన్సీకి వెళ్లడం మంచిది కాదన్నారు.
బ్యాంకు నియంత్రణ కోల్పోయే భయం
'క్రిప్టో కరెన్సీకి అల్గారిథం మద్దతు ఉంది. డబ్బు సరఫరా ద్రవ్యోల్భణ నిర్వహణపై సెంట్రల్ బ్యాంకు నియంత్రణను కోల్పోవచ్చుననే భయం ఉంది. క్రిప్టో ద్రవ్య విధానానికి అంతరాయం కలిగిస్తుందనే ఆందోళనలు ఉన్నాయి.' అని బుధవారం వెబినార్ సమావేశంలో చెప్పారు. CBDCకి కూడా బలమైన డేటా రక్షణ చట్టాలు అవసరమన్నారు. దేశంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గి, క్రమంగా డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయన్నారు. దువ్వూరి సుబ్బారావు 2008-2013 మధ్య ఆర్బీఐ గవర్నర్గా పని చేశారు.
సీఐఐ ఏం కోరిందంటే
క్రిప్టో టోకెన్స్ను ప్రత్యేక తరగతికి చెందిన సెక్యూరిటీలుగా పరిగణించాలని భారత పరిశ్రమల సమాఖ్య (CII) ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు ప్రత్యేక నియంత్రణలు రూపొందించాలని కోరింది. వీటిని ఎవరు జారీ చేశారనే విషయాన్ని పక్కన పెట్టి వాటి ట్రాన్సాక్షన్స్, కస్టడీలపై దృష్టి సారించాలని సూచించింది. సెబీ వద్ద నమోదైన దేశీయ సెంట్రలైజ్డ్ ఎక్స్ఛేంజీలు, కస్టడీ ప్రొవైడర్లను మాత్రమే డిజిటల్ వ్యాలెట్ల నిర్వహణకు అనుమతించాలని కోరింది.