చైనా ప్రతీకారం: ప్రపంచంలోనే ఫస్ట్... రూ.25 లక్షల కోట్ల అలీబాబా సంపద ఆవిరి
చైనా కుబేరుడు, ప్రముఖ ఈ-కామర్స్ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మా ఏడాది క్రితం చేసిన వ్యాఖ్యలు.. ఆయనను ప్రభుత్వం వెంటాడేలా చేసింది. చైనా ప్రభుత్వ విధానాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అక్కడి ప్రభుత్వం ఆయన పైన ప్రతాపం చూపించింది. అక్కడి ప్రభుత్వంపై ఆయన వ్యాఖ్యలు చేసి ఏడాది అవుతోంది. చైనా పాలకుల ఆగ్రహానికి గురైన జాక్మా కంపెనీ ఈ కాలంలో భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. ఆ మాట ఖరీదు 344 బిలియన్ డాలర్లు.
మన కరెన్సీలో రూ.25 లక్షల కోట్ల కంటే ఎక్కువ. 2020 అక్టోబర్ 24వ తేదీన 'ది బండ్ సమ్మిట్' పేరుతో జరిగిన సదస్సులో పాల్గొన్న జాక్మా చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుకే ఆగ్రహం
చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను బట్టబయలు చేశారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల ఆలోచనను వీడాలని సూచించారు. సంప్రదాయబద్ధంగా వస్తోన్న ఆర్థిక విధానాల్లో సమూలమార్పులు అవసరమన్నారు. చైనాలో సచేతనమైన ఆర్థిక విధానాలు లేవని చెబుతూ, ఇవి ఎలా ఉన్నాయంటే రోగికి తప్పుడు మెడిసిన్స్ ఇచ్చినట్లుగా పని చేస్తాయని ఎద్దేవా విమర్శలు గుప్పించారు. చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక కమ్యూనిస్ట్ జిన్పింగ్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి.
చైనా ప్రతీకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద నష్టం
జాక్మా చేసిన వ్యాఖ్యలపై జిన్పింగ్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రతీకారం ప్రారంభించింది. ఆ వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థల ద్వారా ఉక్కుపాదం మోపింది. జాక్ మా ప్రారంభించిన యాంట్ గ్రూప్ ఐపీవోను అడ్డుకుంది. అంతేకాదు, గుత్తాధిపత్య వ్యతిరేక నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలపై చైనా నియంత్రణదారులు ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబాకు 2.8 బిలియన్ డాలర్లు జరిమానా విధించారు.
ఆన్లైన్ రిటైలింగ్లో పోటీని పరిమితం చేయడానికి అలీబాబా తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు జరిమానా విధించినట్లు కమ్యూనిస్ట్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో అలీబాబా షేర్లు వరుసగా నష్టపోయాయి. అలీబాబా సంపద, దీంతో జాక్ మా సంపద కరిగిపోవడం ప్రారంభమైంది. దీంతో చివరకు అలీబాబా తన మార్కెట్ వ్యాల్యూలో రూ.25 లక్షల కోట్లను నష్టపోయింది. అలీబాబా అనుబంధ సంస్థల స్టాక్స్ కూడా నష్టపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ వ్యాల్యూ కూడా ఒక ఏడాది కాలంలో ఈ స్థాయిలో కరిగిపోలేదు.
మళ్లీ పుంజుకున్నాయి.. కానీ
ఇటీవలి కాలంలో అంటే అక్టోబర్ 5 నుండి అలీబాబా స్టాక్స్ కాస్త పుంజుకుంటున్నాయి. అయినప్పటికీ గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే స్టాక్స్ 43 శాతం తక్కువగానే ఉన్నాయి. జాక్ మా యూరోప్లో కనిపించినప్పటి నుండి అలీబాబా, అనుబంధ సంస్థల స్టాక్స్ మరింత పుంజుకోవడం ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ఏడాదిలో రూ.25 లక్షల కోట్ల మార్కెట్ వ్యాల్యూ తగ్గింది ఏడాదిలో అలీబాబా అండ్ గ్రూప్ సంపద ఎంత కరిగిపోయిందంటే...
అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ 344.4 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. కౌషో టెక్నాలజీ 104 బిలియన్ డాలర్లు, పింగ్ అన్ ఇన్సురెన్స్ గ్రూప్ కంపెనీ ఆఫ్ చైనా లిమిటెడ్ 66.1 బిలియన్ డాలర్లు, టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ 65.4 బిలియన్ డాలర్లు, జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ఇంక్ 63 బిలియన్ డాలర్లు, చైనా లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్ 50.8 బిలియన్ డాలర్లు, కేఈ హోల్డింగ్స్ ఇంక్ 50.3 బిలియన్ డాలర్లు, సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్ప్ 40.9 బిలియన్ డాలర్లు, టీఏఎల్ ఎడ్యుకేషన్ 39.1 బిలియన్ డాలర్లు, ఆర్ఎల్ఎక్స్ టెక్నాలజీ ఇంక్ 36.7 బిలియన్ డాలర్లు పడిపోయింది.