Akasa Air: గగన విహంగానికి సిద్ధమైన ఆకాశ ఎయిర్.. టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం.. ధర ఎంతంటే..
Akasa Air: బిలియనీర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా పెట్టుబడులు పెట్టిన అకాశ ఎయిర్ గగన విహారానికి సిద్ధమౌతోంది. విమానయాన సంస్థ తన వాణిజ్య విమానాల టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించింది. కంపెనీ తొలి విమాన ప్రయాణం ఆగస్టు 7న ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రారంభం కానుంది.
ఆ నాలుగు నగరాల మధ్య..
ఆకాశ ఎయిర్ సంస్థ ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య వారానికి 28 విమానాలను నడపనుంది. దీని తరువాత.. ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య ప్రతి వారం 28 విమానాలను నడపనున్నట్లు తెలిపింది. తొలిదశలో.. అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, కొచ్చి నెట్వర్క్లకు కంపెనీ టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించింది.
టికెట్ ఛార్జీలు..
కంపెనీ తాజా ప్రకటన ప్రకారం.. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బోయింగ్ 737 MAX విమాన రాకపోకలు ప్రారంభమౌతాయి. ఈ రూట్లో కనీస వన్వే ఛార్జీ రూ.3,948గా ఉంటుందని ఎయిర్లైన్స్ తెలిపింది. ఈ మార్గంలో ఇతర విమానయాన సంస్థలు దాదాపు రూ.4,262 ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ఆకాశ ఎయిర్కు బోయింగ్ నుంచి తొలి విమానాన్ని అందుకోగా.. రెండో విమానం ఈ నెలాఖరులోపు అందే అవకాశం ఉంది. ఈ వివరాలను కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ వెల్లడించారు.
SNV ఏవియేషన్ పేరుతో..
ఆకాశ ఎయిర్లైన్ మొత్తం 72 విమానాలను ఆర్డర్ చేసింది. అందులో 18 విమానాలను మార్చి 2023 నాటికి డెలివరీ తీసుకోనుంది. దీని తరువాత.. మిగిలిన 54 విమానాలు వచ్చే నాలుగేళ్లలో సరఫరా చేయబడతాయి. SNV ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అకాశ ఎయిర్ బ్రాండ్ పేరుతో భారతీయ విమానయాన రంగంలోకి ప్రవేశిస్తోంది.
వేడి నీటిలో ఆహారం..
ప్రారంభ దశలో అకాశ ఎయిర్ విమానాలు మెట్రో నగరాల నుంచి టైర్-2, టైర్-3 నగరాలకు అందుబాటులో ఉంటాయి. ఇది బడ్జెట్ విమానయాన సంస్థ. ఆకాస విమానాల్లో వేడి ఆహారం కోసం ఓవెన్లు ఉండవు. ప్యాక్ చేసిన ఉప్మా/నూడుల్స్/పోహా/బిర్యానీ తినడానికి ముందు ప్రయాణికులు వాటిని కొన్ని నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచాలి. ఆకాశ ఎయిర్ విమానాల్లో ఒకే తరగతి సీట్లు ఉంటాయి. వీటిలో బిజినెస్ క్లాస్ అస్సలు ఉండవు.