కరోనా దెబ్బకు కుదేలైన ఇండియన్ ఎయిర్ లైన్స్ .. ఆదాయం ఎంతగా తగ్గిందో చెప్పిన ఏవియేషన్ మంత్రి
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం గజగజా వణుకుతున్న విషయం తెలిసిందే . కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య విమానయాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి. ఇప్పటి వరకు కూడా చాలా విమానయాన సర్వీసులను పునరుద్ధరించని పరిస్థితి ఉంది. దీంతో కరోనా వైరస్ కారణంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో విమానయాన సంస్థల ఆదాయం గణనీయంగా పడిపోయిందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు.
2020 - 2021 మొదటి త్రైమాసికంలో భారత విమానయాన సంస్థ ఆదాయం 3,651 కోట్ల రూపాయలకు చేరుకుందని మంత్రి పేర్కొన్నారు . గత ఏడాదితో పోలిస్తే 85.7 శాతం ఆదాయం తగ్గిందని ఆయన చెప్పారు. అంతేకాకుండా భారత్ క్యారియర్ లలో ఉద్యోగుల సంఖ్య మార్చి 31న 74, 887 మంది ఉండగా, జులై 31 వరకు 69,589 చేరిందని దాదాపు 5 వవేల మంది ఉద్యోగుల సంఖ్య తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఇక ఇది 7.0 7 శాతంగా ఉందని రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో భాగం గా మంత్రి పేర్కొన్నారు.
విమానాశ్రయ నిర్వాహకుల ఆదాయం 2019 సంవత్సరంలో , ఏప్రిల్ - జూన్ మధ్యకాలంలో 75,745 కోట్ల నుండి 2020 ఏప్రిల్ - జూన్ కాలంలో 4,894 కోట్లకు పడిపోయిందని , దీంతో ఏవియేషన్ రంగంపై దెబ్బ పడిందని అన్నారు . అంటే మొత్తంగా చూస్తే 85.7 శాతం తగ్గిందని మంత్రి పేర్కొన్నారు.విమానాశ్రయాలలో ఉద్యోగుల సంఖ్య మార్చి 31 న 67,760 నుండి జూలై 31 న 64,514 కు తగ్గిందని మంత్రి తెలిపారు.
కరోనావైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ కారణంగా షెడ్యూల్డ్ దేశీయ విమాన యాన సేవలను మార్చి 25 నుండి మే 24 వరకు భారతదేశంలో నిలిపివేసిన విషయం తెలిసిందే. వాటిని మే 25 నుండి తిరిగి పునరుద్ధరించినప్పటికీ, భారీగా విమాన సర్వీసులు తగ్గించారు. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.
ఇదే సమయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలలో ఉద్యోగుల సంఖ్య ఏప్రిల్-జూలై కాలంలో 22.44 శాతం తగ్గి 29,254 కు చేరుకుందని ఏవియేషన్ మంత్రి పూరి చెప్పారు. రాజ్యసభలో హర్దీప్ సింగ్ పురి "పౌర విమానయాన రంగంపై కరోనా వైరస్ ప్రభావం" గురించి లెక్కల తో పాటు సమాధానమిచ్చారు.