సేల్.. లేదంటే క్లోజ్! ఎయిర్ ఇండియాపై కేంద్రం యోచన ఇదే...
పీకల్లోతు అప్పుల్లో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను నడిపే కంటే అమ్మివేయడం ఉత్తమమని.. ఒకవేళ అమ్ముడుకాకపోతే దాన్ని మూసేయడమే మంచిదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటీకరణ కోసం త్వరలో మరో ప్రయత్నం చేయాలని, ఒకవేళ అది విఫలమైతేగనుక ఎయిర్ ఇండియాను మోయడం ఇకమీదట తమ వల్ల కాదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేసింది.
భారీ నష్టాలతో ఎయిర్ ఇండియాను నడిపే కంటే మూసివేయడమే మంచిదని కేంద్రం భావిస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తాజాగా రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. 'ప్రైవేటీకరణ కుదరకపోతే ఇక ఎయుర్ ఇండియాను మూసివేయడమే మార్గం' అని ఆయన పేర్కొన్నారు.
ఏడాదిన్నర క్రితం కూడా మోడీ ప్రభుత్వం ఎయిర్ ఇండియా ఈక్విటీలో 76 శాతం వాటాను అమ్మకానికి పెట్టింది. అయితే కంపెనీ అప్పులు, నష్టాలు చూసి ఏ కంపెనీ కూడా ఎయిర్ ఇండియాలో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఎయిర్ ఇండియా అమ్మకం వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి కేంద్రం ఎయిర్ ఇండియా విక్రయానికి ప్రయత్నిస్తోంది.
ఈసారి మరింత ఆకర్షణీయమైన ప్రపోజల్...
ఎలాగైనా ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోగా ఎయిర్ ఇండియాను వదిలించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీని విక్రయానికి కంపెనీలను ఆకర్షించేందుకు ఎయిర్ ఇండియా ఈక్విటీలో పూర్తి వాటాను అమ్ముతామంటూ ప్రకటించింది. పైగా ఈ కంపెనీకి ఉన్న దాదాపు రూ.78,450 కోట్ల అప్పుల్లో రూ.50,000 కోట్ల అప్పుల్ని మినహాయిస్తామని కూడా చెబుతోంది.
మరోవైపు ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ జరిగితే తమ ఉద్యోగాలు ఊడుతాయని అందులో పనిచేసే ఉద్యోగులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరిస్తే ఉద్యోగాలు పోతాయని భయపడుతున్న ఉద్యోగుల్ని సముదాయించేందుకూ కేంద్రం ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది.
ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించినా.. ఏడాది వరకు అందులోనిసిబ్బంది ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని కూడా పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి రాజ్యసభలో ప్రకటించారు. వీలైనంత త్వరలో ఎయిర్ ఇండియా లెక్కల పద్దులు తేల్చి.. దీని విక్రయానికి చర్యలు తీసుకోవాలని, ఆసక్తి ఉన్న కంపెనీలను.. వచ్చే నెల 15 నుంచి ఆసక్తి వ్యక్తీకరణలకు అనుమతించాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.