ఎయిర్ ఇండియా సేల్.. ఫైనాన్షియల్ బిడ్స్ ఆహ్వానించిన కేంద్రం.. సెప్టెంబర్ నాటికి విక్రయించేలా...
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిడ్లను ఆహ్వానించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఎయిర్ ఇండియా అమ్మకాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. టాటా గ్రూప్ సహా పలు కంపెనీలు ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం గతేడాది డిసెంబర్లోనే ప్రిలిమినరీ బిడ్స్ దాఖలు చేశాయి.
వాటిని విశ్లేషించిన కేంద్రం.. అర్హత కలిగిన సంస్థలకు వర్చువల్ డేటా రూమ్(వీడీఆర్) యాక్సెస్ ఇచ్చింది. ఇందులో ఇన్వెస్టర్ల సందేహాలను నివృత్తి చేస్తారు. 64 రోజుల పాటు వీడీఆర్ యాక్సెస్ కల్పిస్తారు. ఆ తర్వాత ఆయా కంపెనీలు సమర్పించే బిడ్స్ ఆధారంగా ఎయిర్ ఇండియాను ఎవరికి అప్పగించాలన్నది నిర్ణయిస్తారు.
ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియాలను 2007లో విలీనం చేసినప్పటి నుంచి సంస్థ భారీ నష్టాలు,అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇందులో 100శాతం వాటాను అమ్మేయాలని నిర్ణయించింది. గతేడాది కరోనా కారణంగా ప్రిలిమినరీ బిడ్స్ గడువును ఐదుసార్లు పొడగించారు. ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ప్రస్తుతం ఆర్థిక బిడ్స్ దశలో ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
ఎయిర్ ఇండియాను సొంతం చేసుకునే కంపెనీకి భారత్లో 4,400 దేశీయ, 1,800 అంతర్జాతీయ ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లు దక్కుతాయి. అలాగే విదేశాల్లో 900 స్లాట్లు దక్కుతాయి.
నిజానికి 2017లోనే ఎయిర్ ఇండియాను విక్రయించేందుకు కేంద్రం నిర్ణయించింది. అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టినా ఆశించినంత స్పందన లేదు. ఎయిర్ ఇండియా రూ.60,074కోట్ల అప్పును బిడ్డర్సే భరించాలని కేంద్రం షరతు విధించడంతో ఎవరూ ఆసక్తి కనబరచలేదు. ప్రభుత్వం ఇప్పుడా ఆ షరతును సడలించింది. అప్పును ఎంతవరకు భరిస్తారన్న విషయాన్ని ఇన్వెస్టర్లకే వదిలిపెట్టింది.
ఎయిర్ ఇండియాను విక్రయించేంతవరకు ప్రభుత్వమే దాన్ని నిర్వహిస్తుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతంలో వెల్లడించారు. అయితే అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించడం లేదా మూసివేయడం తప్ప మరో మార్గం లేదని అన్నారు. ప్రతీరోజూ దాదాపు రూ.20కోట్లు నష్టాల్లో ఎయిర్ ఇండియా నడుస్తోందన్నారు.