Air India: మళ్లీ తెరమీదకు వీఆర్ఎస్.. టాటాలు ఎంతమందికి అవకాశమిచ్చిందంటే..
Air India: టాటాల చేతికి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా ఆధునికీకరణ, విస్తరణ వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రమంలో కంపెనీ వాలెంటరీ రిటైర్మెంట్ పథకాన్ని కూడా అమలులోకి తెచ్చింది.
టాటా గ్రూప్ తన ఎయిర్లైన్స్ అయిన ఎయిర్ ఇండియా నాన్-ఫ్లయింగ్ స్టాఫ్ కోసం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(VRS)ని ప్రవేశపెట్టింది. జనవరి 2022లో విమానయాన సంస్థను కొనుగోలు చేసిన తర్వాత టాటా గ్రూప్ రెండోసారి ఈ అవకాశాన్ని ప్రవేశపెట్టింది. ఒకపక్క కంపెనీ కొత్త స్కిల్ ఉద్యోగులను భారీగా రిక్రూట్ చేసుకుంటూనే మరోపక్క పాత ఉద్యోగులు కంపెనీని వీడేందుకూ అవకాశాన్ని కల్పిస్తోంది.
ఈ ఆఫర్ కింద 40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నఉద్యోగులు అర్హులు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఎయిర్లైన్లో కనీసం ఐదేళ్ల నిరంతర సేవలను పూర్తి చేసిన శాశ్వత సాధారణ కేడర్ అధికారులకు ఈ అవకాశాన్ని అందిస్తోంది. కనీసం ఐదు సంవత్సరాల నిరంతర సర్వీసును పూర్తి చేసిన క్లర్క్ లేదా నాన్-స్కిల్డ్ కేటగిరీ ఉద్యోగులు కూడా ఇందుకు అర్హులు. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు తెరిచి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

కంపెనీ ఈ సారి ప్రారంభించిన వీఆర్ఎస్ కార్యక్రమానికి సుమారు 2,100 మంది ఉద్యోగులు అర్హులని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఎయిర్ ఇండియా జూన్ 2022లో ఇదే ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇందు కోసం మార్చి 17 నుంచి ఏప్రిల్ 30, 2023 వరకు దరఖాస్తులను ఇవ్వవచ్చని తెలుస్తోంది. మార్చి 31, 2023 వరకు దరఖాస్తు చేసుకున్న అర్హతగల ఉద్యోగులు ఎక్స్గ్రేషియా మొత్తానికి అదనంగా రూ.లక్ష పొందుతారు. ఈ ఆఫర్ కంపెనీ ప్రవేశపెట్టగా మెుత్తం 4,200 మంది అర్హులైన ఉద్యోగుల్లో దాదాపు 1,500 మంది దీని ప్రయోజనాన్ని పొందారు.
గత ఏడాది సెప్టెంబరులో ఎయిర్ ఇండియా పరివర్తన ప్రణాళికను Vihaan.AI ప్రకటించింది. ఇది ఐదు సంవత్సరాల వ్యవధిలో సాధించాల్సిన విభిన్న లక్ష్యాలపై దృష్టి సారించింది. ఎయిర్ ఇండియాను అభివృద్ధి చెందిన, లాభదాయకమైన, దేశీయ విమానయాన రంగంలో మార్కెట్ ఆధిపత్య సంస్థగా మార్చడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా ఉంది.


Click it and Unblock the Notifications