మే చివరి నాటికి ఎయిరిండియాకు కొత్త యాజమాన్యం
వచ్చే 64 రోజుల్లే ప్రభుత్వ విమానయానరంగ సంస్థ ఎయిరిండియాకు నూతన యాజమాన్యం ఖరారవుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. వచ్చే మే నెలాఖరు వరకు ఎయిరిండియా భవిష్యత్తు యజమానిని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తద్వారా పౌర విమానయాన రంగంలో అతిపెద్ద సంస్కరణ కానుంది. ఓ ఎకనమిక్ కాంక్లేవ్లో ఆయన మాట్లాడారు.
ఎయిరిండియాకు జూన్ నాటికి కొత్త యాజమాన్యం వస్తుందనే అంచనాలు ఉన్నాయని తెలిపారు. ఆర్థిక బిడ్స్ను త్వరలో ఆహ్వానిస్తామని చెప్పారు. ఎయిరిండియాను ప్రయివేటీకరించాలని లేదంటే అమ్మివేయాలన్నారు. ఇంతకుమించి మరో మార్గం లేదన్నారు. విక్రయించేవరకు ఆ సంస్థను ప్రభుత్వం నడిపించాల్సి ఉంటుందని చెప్పారు. బిడ్స్ ప్రక్రియ పూర్తిచేసేందుకు 64 రోజుల సమయం పడుతుందన్నారు. ఇదంతా మే చివరి నాటికి పూర్తి కావొచ్చునన్నారు.
ఆ తర్వాత ఎయిరిండియాను ఎవరికి అప్పగించాలనేది తెలుస్తుందన్నారు. ఎయిరిండియాకు రోజూ రూ.20 కోట్ల చొప్పున నష్టం వస్తోందని, నిర్వహణ వైఫల్యాల కారణంగా ఎయిరిండియా మొత్తం రుణాలు రూ.60,000 కోట్లకు చేరాయన్నారు. సంస్థ కోసం ప్రతిసారీ ఆర్థిక మంత్రి వద్దకు వెళ్లి డబ్బులు అడగలేకపోతున్నట్లు తెలిపారు. కాగా, ఎయిరిండియా కోసం ఆల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీతో కలిసి స్పైస్ జెట్ యజమాని అజయ్ సింగ్, ఢిల్లీకి చెందిన బర్డ్ గ్రూప్ ప్రమోటర్ అంకుర్ బాటియా, టాటా సన్స్ బిడ్స్ దాఖలు చేసింది.