యూకే-భారత్ మధ్య 24 నుండి 30 వరకు ఎయిరిండియా విమానాలు రద్దు
భారత్-యూకే మధ్య ఎయిరిండియా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఈ మేరకు ఏప్రిల్ 24వ తేదీ నుండి 30 ఏప్రిల్ వరకు రద్దు చేస్తున్నట్లు జాతీయ విమానయాన సంస్థ ప్రకటించింది. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో యూకేలో కఠన చర్యలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
'యూకే-భారత్ మధ్య ప్రయాణం చేసే ప్రయాణీకులు ఇటీవలి కరోనా ఆంక్షలను దృష్టిలో పెట్టుకోవాలి, రెండు దేశాల మధ్య 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాకపోకలు రద్దు చేయబడ్డాయి' అని ఎయిరిండియా ట్వీట్ చేసింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తిరగబెడుతోన్న విషయం తెలిసిందే. భారత్లో సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది.
ప్రయాణీకుల రీషెడ్యూలింగ్, రీఫండ్, మాఫీ గురించిన సమాచారాన్ని ఎయిరిండియా త్వరలో అప్ డేట్ చేయనుంది. ఏప్రిల్ 24వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ మధ్య వారానికి ఓసారి విమాన ప్రయాణాన్ని షెడ్యూల్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని ఎయిరిండియా తెలిపింది.