బకాయిలు చెల్లిస్తేనే టిక్కెట్లు: ప్రభుత్వ సంస్థలకు ఎయిరిండియా షాక్, ఎంత చెల్లించాలంటే..
నిధులలేమీతో సతమతమవుతోన్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా త్రిశంకు స్వర్గంలో ఉంది. మార్చిలోపు ప్రయివేటీకరణ జరగకుంటే క్లోజ్ అవుతుందనే వ్యాఖ్యలు ఉద్యోగులను గందరగోళంలో పడేశాయి. ఈ నేపథ్యంలో 800 మంది పైలట్లు సభ్యులుగా ఉన్న ICPA కేంద్రమంత్రికి ఇటీవల ఘాటు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇలా అయితే తాము ఉద్యోగాలు చేయలేమని, తమ వేతన బకాయిలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాజాగా, ఎయిరిండియా అధికారులు ప్రభుత్వానికి మరో షాకిచ్చారు.
'మా శాలరీ మాకివ్వండి, మేం ఈ ఉద్యోగం చేయలేం'
టిక్కెట్లు నిలిపేశాం
ప్రభుత్వ ఏజెన్సీలకు క్రెడిట్ బేస్ పైన టిక్కెట్లు ఇవ్వడాన్ని ఎయిరిండియా నిలిపివేసింది. ఆయా ప్రభుత్వ ఏజెన్సీల నుంచి బకాయిలు రావాల్సి ఉందని, అందుకే టిక్కెట్లు జారీ చేయడం లేదని ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు గురువారం చెప్పారు. ఏజెన్సీలు తమ బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు క్రెడిట్ పైన టిక్కెట్లు ఇవ్వడం నిలిపివేశామని సదరు ప్రతినిధి చెప్పారు.
పాత బకాయిలు రూ.10 లక్షలు
పాత బకాయిలు చెల్లించాలని, ఆ తర్వాతే కొత్తగా విమాన టిక్కెట్లు జారీ చేస్తామని చెప్పకనే చెప్పారు. ఆఫీస్ పని నిమిత్తం వల్ల ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒకచోటు నుంచి మరో చోటుకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణిస్తారు. ఇలా వారు ప్రయాణించిన మొత్తం టిక్కెట్ల విలువ రూ.10 లక్షలు. వీటిని ఎయిరిండియాకు చెల్లించాల్సి ఉంది. సర్వీసులు నడపలేక ఇబ్బంది పడుతున్న ఎయిరిండియా పాత బకాయిలపై దృష్టి సారించింది.
మొత్తంగా రూ.268 కోట్లు
వివిధ ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఎయిరిండియాకు టిక్కెట్ల రూపంలో రావాల్సిన మొత్తం రూ.268 కోట్లు అని చెబుతున్నారు. మీడియాలో వస్తున్న వార్తల మేరకు లోకసభ సెక్రటరియేట్, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేష్, లేబర్ కమిషన్లకు మాత్రం ఇందులో నుంచి మినహాయింపు ఉంది. ఇవి కాకుండా మిగతా ఏజెన్సీలు పై మొత్తం చెల్లించాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఎయిరిండియా రూ.50 కోట్ల పాత బకాయిలు వసూలు చేసుకుంది.
పదేళ్లలో తొలిసారి
ఇతర ప్రభుత్వరంగ ఉద్యోగులకు టిక్కెట్లను తిరస్కరించడం గడిచిన పదేళ్లలో ఇదే తొలిసారి. తిరస్కరించిన సంస్థల్లో సీబీఐ, ఐబీ, ఈడీ, కస్టమ్స్ కమిషనర్స్, సెంట్రల్ లేబర్ ఇనిస్టిట్యూట్, ఇండియన్ ఆడిట్ బోర్డ్, కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, భద్రత దళాలు ఉన్నాయి. ప్రభుత్వ, ఏజెన్సీలకు సంబంధించిన ఉన్నతాధికారులు తమ ప్రయాణానికి మొదట ఎయిరిండియా సర్వీసులనే వినియోగించుకోవాలి. సంస్థ నడుపని రూట్లలో మాత్రమే ఇతర విమాన సర్వీసులు వినియోగించాలి.
ప్రభుత్వరంగ సంస్థలు.. మొండి బకాయిలుగా...
గత కొన్ని రోజుల్లో రూ.50 కోట్ల పాత బకాయిలు వసూలు చేసినట్లు ఓ ప్రతినిధి తెలిపారు. ఇందులో దీర్ఘకాలికంగా ఉన్న బకాయిలు ఉన్నాయన్నారు. కంపెనీ చరిత్రలో ప్రభుత్వరంగ సంస్థల్ని మొండిబకాయిలుగా ప్రకటించడం ఇదే తొలిసారన్నారు. సంస్థ బకాయిల్లో ఎక్కువగా పశ్చిమ భారతం నుంచి రూ.22.8 కోట్లకు పైగా ఉన్నాయన్నారు. ముంబైకి చెందిన కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ రూ.5.4 కోట్లు, బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఇసోటోపో్ టెక్ సైంటిఫిక్ ఆఫీసర్ డీ రూ.2.4 కోట్లు, సీబీఐ రూ.95 లక్షలు, ఈడీ రూ.12.8 లక్షలు, రైల్వే మంత్రిత్వ శాఖ రూ.36 లక్షలు, పశ్చిమ రైల్వే రూ.4.8 లక్షలు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు.
సమ్మెకు ఛాన్స్
ఇదిలా ఉండగా, ఎయిరిండియా ఉద్యోగులు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. సమ్మె నిర్ణయం ఉంటే జనవరి రెండో వారంలో ఉండవచ్చునని తెలుస్తోంది. మరోవైపు ఎయిరిండియా బిడ్స్ జనవరి మధ్య నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.