కరోనా ప్రభావం.. ఈసారి భారత ఎకానమీకి ఊతమిచ్చేవి ఇవే..
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఇందుకు మన దేశం మినహాయింపు కాదు. ఒకటి రెండు రంగాలకు స్వల్ప ఊరట మినహాయించి అన్ని రంగాలపై తీవ్రప్రభావం పడింది. ఉద్యోగాలు కోత, వేతనాల కోత, ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా తెరుచుకోకపోవడంతో వ్యాపారాలు లేకపోవడం.. ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్కు ఊరటనిస్తున్న ఒకే ఒక రంగం వ్యవసాయం.
ఆంధ్రప్రదేశ్ ఆ సంక్షోభం గుర్తుందిగా..: లోన్ మారటోరియంపై రఘురాం రాజన్ హెచ్చరిక
ఈసారి వ్యవసాయమే ఆర్థిక వ్యవస్థకు అండ
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు కనిపించినా ఇటీవల ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులతో మళ్లీ మందగమనం తప్పడంలేదని ఇటీవల ప్రకటించిన ఆర్బీఐ, ఈసారి వ్యవసాయం మాత్రం పుంజుకుంటుందని తెలిపింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే అండ అని చాలామంది భావిస్తున్నారు. ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం. మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇప్పటికీ ఇందుకు సంబంధించి ఇబ్బందులు మనకు లేవు.
వృద్ధికి ఇవి అవరోధం
కరోనా లాక్ డౌన్ ఎత్తివేత నిబంధనల సడలింపులతో వివిధ రంగాలు కొద్దికొద్దిగా గాడిలో పడుతున్నాయి. అలా అని ఇబ్బందులు తొలగిపోయినట్లుగా చెప్పలేం. ఈ ఆర్థిక ఏడాది వరుణుడు సకాలంలో కరుణించడంతో ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం పెద్ద అండ అని ఆర్థికమంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఇందుకు దోహదం చేస్తాయని ఇటీవల తెలిపింది. అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు, కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు వృద్ధి పుంజుకోవడానికి అవరోధమేనని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది.
దేశ వృద్ధిని ముందుకు తీసుకెళ్లేది గ్రామీణమే
2020-21లో ఆర్థిక వ్యవస్థపై కరోనా సంక్షోభ ప్రభావాన్ని వ్యవసాయ రంగం పరిమితం చేసే అవకాశముందని కూడా ఆర్థిక శాఖ కొంతలో కొంత ఊరట ప్రకటన చేసింది. సాధారణానికి మించి వర్షపాతం నమోదు కావొచ్చుననే అంచనాలు, స్థూల దేశీయ ఉత్పత్తిలో 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం ఆర్థిక వ్యవస్థకు అండగా నిలువవచ్చు. లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగానికి సరైన సమయంలో ఇచ్చిన మినహాయింపులు, చురుగ్గా వ్యవహరించి తీసుకున్న నిర్ణయాల వల్ల రికార్డ్ స్థాయిలో పంట దిగుబడి పెరిగి అవకాశముంది. రానున్న కొద్ది నెలలు గ్రామీణ ప్రాంతాలే దేశ వృద్ధిని ముందుకు తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించనున్నాయని అభిప్రాయపడుతున్నారు.
వ్యవసాయం.. గ్రామీణం.. వినియోగ డిమాండ్
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం వృద్ధి, ఉపాధి పనులు పెరగడం వంటి వివిధ కారణాలతో నగరాల్లో కంటే ఇక్కడే వినియోగ డిమాండ్ పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. పంటదిగుబడి పెరిగితే వినియోగమూ పెరుగుతుంది. గ్రామీణం, వ్యవసాయానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయం.. గ్రామీణమే ఈసారి భారత్ పైన కరోనా సంక్షోభాన్ని కొంతమేర పరిమితం చేసే అవకాశముందని భావిస్తున్నారు. మే నెలలో 30.8 శాతంగా ఉన్న భారత తయారీ రంగ పీఎంఐ సూచీ జూన్ నాటికి 47.2 శాతం పెరిగింది. సేవా రంగం పీఎంఐ సూచీ 12.6 శాతం నుండి 33.7 శాతానికి పెరిగింది.