AGR case: వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్, టాటా టెలీలకు సుప్రీం కోర్టులో భారీ షాక్
అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(AGR) బకాయిలకు సంబంధించి సుప్రీం కోర్టులో టెలికం కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఏజీఆర్ బకాయిలను తిరిగి లెక్కించాలని విజ్ఞప్తి చేసిన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ హృషికేష్ రాయ్తో కూడిన ధర్మాసనం నేడు విచారణ జరిపింది. అనంతరం టెల్కోస్ అభ్యర్థనకు నో చెప్పింది.
సుప్రీం కోర్టుకు టెల్కోలు
AGR ఛార్జీల లెక్కింపుకు డిపార్ట్ ఆఫ్ టెలికం(DOT) అనుసరించిన విధానంలో దోషాలు ఉన్నాయని టెలికం సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఆ దోషాలు పక్కనపెట్టి లెక్కిస్తే AGR ఛార్జీలు తగ్గుతాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో AGR ఛార్జీలను తిరిగి లెక్కించేలా DOTకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, టాటా టెలీ సర్వీసెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
తిరిగి లెక్కించడం కుదరదు
విచారణ జరిపిన కోర్టు అందుకు విముఖత వ్యక్తం చేసింది. AGR ఛార్జీలను పది వార్షిక వాయిదాల్లో చెల్లించాలని ఏప్రిల్ 1వ తేదీన జారీ చేసిన ఆదేశాల్లోనే పునఃలెక్కింపును కోర్టు నిషేధించిందని ఈ రోజు ఇచ్చిన తీర్పులో గుర్తు చేసింది. AGR ఛార్జీలను తిరిగి లెక్కించడం కుదరని తేల్చి చెప్పింది.
ఏం చెబుతున్నాయంటే
ఇప్పటికే సబ్స్క్రైబర్లని కోల్పోతున్న, నిధులలేమితో ఇబ్బంది పడుతున్న వొడాఫోన్ ఐడియాకు ఈ తీర్పు భారీ ఎదురుదెబ్బ. DoT ప్రకారం వొడాఫోన్ ఐడియా రూ.58,400 కోట్లు, టాటా టెలీసర్వీసెస్ రూ.16,798 కోట్లు, ఎయిర్ టెల్ రూ.43,980 కోట్లు చెల్లించవలసి ఉంది. వీటిలో వొడాఫోన్ రూ.7,854 కోట్లు, ఎయిర్టెల్ రూ.18,003, టాటా టెలీ సర్వీసెస్ రూ.4,197 కోట్లు చెల్లించాయి. కానీ తమ లెక్కల ప్రకారం వొడాఫోన్ ఐడియా రూ.21,533 కోట్లు, ఎయిర్టెల్ రూ.13,003 కోట్లు, టాటా టెలీ సర్వీసెస్ రూ.2,197 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆయా సంస్థలు చెబుతున్నాయి. DoT దోషాలను సరిదిద్దితే తమ ఏజీఆర్ బకాయిలు భారీగా తగ్గుతాయని అంటున్నాయి.