జగన్ ప్రభుత్వం నిర్ణయం, ప్రజలపై రూ.700 కోట్ల భారం! ఆర్డినరీలో మినిమం ఛార్జ్ రూ.10
అమరావతి: ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచింది. కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెంచింది. ఇప్పుడు వైయస్ జగన్మోహన్ ప్రభుత్వం కూడా ధరలు పెంచింది. నాడు ఆర్టీసీ నష్టాలు అన్నింటిని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి, ఇప్పుడు మాట తప్పి బస్సు ఛార్జీలు పెంచుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ కిలో మీటరుకు 10 పైసల నుంచి 20 పైసలు పెంచుతోంది. సిటీ సర్వీసులు, పల్లె వెలుగుల్లో కి.మీ.కు 10 పైసల చొప్పున, ఇతర సర్వీసుల్లో 20 పైసల చొప్పున పెంచుతున్నారు.
తొలిసారి జగన్ స్కీం: రోజుకు రూ.225, డబ్బులు అందకుంటే..
ప్రజలపై రూ.700 కోట్ల భారం
ఏపీఎస్ఆర్టీసీ పెంచిన బస్సు ఛార్జీలతో ప్రయాణీకులపై రూ.700 కోట్ల భారం పడనుంది. పెంచిన ఛార్జీల వల్ల రోజుకు సగటున రూ.2 కోట్ల మేర అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు సంస్థకు రూ.1200 కోట్ల మేర నష్టం వస్తోంది. ఛార్జీలు పెంచితే కొంత వెసులుబాటు కలగనుంది.
కనీస ఛార్జ్ రూ.10
- ఛార్జీల పెంపు నేపథ్యంలో ఆర్డినరీ సిటీ బస్సుల్లో కనీస ఛార్జ్ రూ.10 కానుంది.
- పల్లె వెలుగులో దూరాన్ని బట్టి రూపాయి నుంచి గరిష్టంగా రూ.5 వరకు పెరగనుంది.
- ఆర్టీసీకి ప్రతి రోజు వచ్చే సగటు ఆదాయం రూ.13.5 కోట్లు. ఇందులో సగం పల్లె వెలుగు ద్వారా వస్తోంది.
బతికించాలంటే ఛార్జీలు పెంచాల్సిందే
ఆంధ్రప్రదేశ్లో ప్రతి రోజు అరవై లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణిస్తారు. ఇందులో 20 లక్షల మంది విద్యార్థి పాస్లు ఉన్నవారు. మరో 30 లక్షల మంది పల్లె వెలుగు, సిటీ ఆర్డీనరీల్లో ప్రయాణిస్తారు. 12 లక్షల మందికి పైగా ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. ఆర్టీసీని బతికించాలంటే ఛార్జీలు పెంచాల్సిందేనని భావిస్తున్నారు. ఇప్పటికే రూ.6500 కోట్ల నష్టాల్లో ఉందని, ఛార్జీలు పెంచకుంటే దివాళా తీసే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు.
సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్లో 5,555 పల్లెవెలుగు బస్సులు, 749 సిటీ ఆర్డినరీ, 600 మెట్రో ఎక్స్ప్రెస్, 1,935 ఎక్స్ప్రెస్, 421 ఘాట్ సర్వీస్లు, 711 అల్ట్రా డీలక్స్, 1,397 సూపర్ లగ్జరీ, 314 ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. కాగా, ఛార్జీల పెంపుకు సంబంధించిన ఫైల్ను ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఉత్తర్వులు రాగానే సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగే అవకాశముంది.
ప్రయాణీకులపై రూ.1000 కోట్ల భారం
ఛార్జీల పెంపుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీ ఛార్జీలను పెంచడం వల్ల ప్రయాణీకులపై రూ.1000 కోట్ల భారం పడుతుందని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, అప్పులు, నష్టాలన్నీ సర్కారే భరిస్తోందని కోతలు కోసిన జగన్ ఇప్పుడు ఛార్జీలు పెంచారన్నారు. ఆర్టీసీ ఛార్జీలు, ఉల్లి ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 11న లెఫ్ట్ పార్టీలు నిరసన తెలపనున్నాయి.