జియో తర్వాత గూగుల్ దృష్టి ఆ కంపెనీపై... ఎందుకో తెలుసా?
ఇండియా లో ఇటీవల రిలయన్స్ జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రపంచమంతా కరోనా వైరస్ తో పోరాటం చేస్తూ అతి పెద్ద సంక్షోభాన్ని చవిచూస్తుండగా... రిలయన్స్ జియో మాత్రం కేవలం 4 నెలల్లో సుమారు రూ 1.5 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించి మాంచి ఊపు మీద ఉంది. ఇందులో ప్రపంచ దిగ్గజ కంపెనీలు గూగుల్, ఫేస్బుక్ కూడా పెట్టుబడి పెట్టటం విశేషం. రిలయన్స్ జియో లో గూగుల్ ఏకంగా 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇండియా లో వచ్చే ఐదారు ఏళ్లలో సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్న గూగుల్ ఆలోచనకు తగ్గట్లే జియో లో భారీ మొత్తం పెట్టుబడిగా పెట్టింది. అయితే, ప్రస్తుతం గూగుల్ దృష్టి రిలయన్స్ జియో తర్వాత మరో ఇండియన్ స్టార్టుప్ కంపనీపైకి మళ్లింది. ప్రస్తుతం అందులో కూడా వాటా కొనుగోలు చేయాలని గూగుల్ ప్రయత్నాలు మొదలు పెట్టినల్టు మార్కెట్ వర్గాల సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ డీల్ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఆ రోజు దారుణ పరిస్థితి చూశాం: ఆనంద్ మహీంద్రా
పాలసీ బజార్ లో 150 మిలియన్ డాలర్లు...
రిలయన్స్ జియో తర్వాత గూగుల్ ఆసక్తి చూపుతున్న కంపెనీ పాలసీ బజార్ అని తెలిసింది. ఆన్లైన్ లో వివిధ కంపెనీల బీమా పాలసీ లను కొనుగోలు చేసే అవకాశం కల్పించటం పాలసీ బజార్ ప్రత్యేకత. ఇప్పటికే ఈ కంపెనీ లో సాఫ్ట్ బ్యాంకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టింది. తాజాగా దీనిపై గూగుల్ దృష్టి పడిందని సమాచారం. దీంతో పాలసీ బజార్ లో గూగుల్ ఏకంగా 150 మిలియన్ డాలర్లు (సుమారు రూ 1,125 కోట్లు) పెట్టుబడిగా పెట్టనుంది. ఈ పెట్టుబడితో పాలసీ బజార్ లో గూగుల్ కు 10% వాటా లభించనుంది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. త్వరలోనే ఈ డీల్ గురించి అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఎగ్జిట్ దిశగా సాఫ్ట్ బ్యాంకు...
ప్రస్తుతం పాలసీ బజార్ లో జపాన్ పెట్టుబడి దిగ్గజం సాఫ్ట్ బ్యాంకు అతి పెద్ద వాటాదారుగా ఉంది. ఆ తర్వాత టైగర్ గ్లోబల్, టెన్సన్ట్ అనే సంస్థలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టాయి. అయితే ప్రస్తుతం సాఫ్ట్ బ్యాంకు నకు పాలసీ బజార్ లో 15% వాటా ఉంది. గూగుల్ ప్రవేశంతో సాఫ్ట్ బ్యాంకు పాక్షికంగా ఎగ్జిట్ అవ్వాలని భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. అయితే టెన్సన్ట్ కూడా కొంత మేరకు ఎగ్జిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాల మధ్య అది తప్పనిసరి అని భావిస్తున్నట్లు సమాచారం. కానీ, గూగుల్ అధికారికంగా పెట్టుబడి గురించి ప్రకటిస్తే గానీ... ప్రస్తుత ఇన్వెస్టర్లలో ఎవరు పాక్షికంగా లేదా పూర్తిగా వైదొలుగుతారో తెలియదు. మరోవైపు ఈ లావాదేవీ జరిగితే రిలయన్స్ జియో తర్వాత గూగుల్ రెండో అతిపెద్ద పెట్టుబడి ఇదే కానుంది.
ఐపీవో కు పాలసీ బజార్...
ఇప్పటికే డిజిటల్ పాలసీ విక్రయ సేవలు అందిస్తున్న పాలసీ బజార్... 2021 సెప్టెంబర్ లో ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి. ఐపీవో కు వెళ్లే సమయానికి పాలసీ బజార్ విలువ సుమారు 3.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ 26,250 కోట్ల) ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఐపీవో ద్వారా సుమారు 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ 3,750 కోట్లు) నిధులు సమీకరించాలని పాలసీ బజార్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అంతకు ముందే 250 మిలియన్ డాలర్ల (రూ 1,875 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. ఆ ప్రణాళికలో భాగంగానే ప్రస్తుతం గూగుల్ నుంచి 150 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించటం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే పాలసీ బజార్ అమెరికా లో గానీ ఇండియా లో గానే ఐపీవో కు వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే ఇండియా నుంచి ఐపీవో కు వెళ్లే తొలి డిజిటల్ స్టార్టుప్ కంపెనీగా పాలసీ బజార్ రికార్డు సృష్టించనుంది.