భారీగా పెరిగిన క్రూడాయిల్ బ్యారెల్ ధర: పెట్రోల్, డీజిల్ వాత మళ్లీ తప్పదా?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైన తొలి రోజుల్లో 140 డాలర్ల వరకు వెళ్లిన క్రూడాయిల్ బ్యారెల్ ప్రైస్..ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. 90 నుంచి 100 డాలర్ల మధ్యలో ఉంటూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ పెరిగింది. 110 డాలర్లను దాటేసింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ ఒక్కింటికి 110.47 డాలర్లకు చేరింది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఫలితంగా దీని ప్రభావం దేశీయ ఇంధన కొనుగోళ్లపై పడే ప్రభావం లేకపోలేదనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.
క్రూడాయిల్ బ్యారెల్ ఒక్కింటికి 110 డాలర్లను దాటితే- ఆ భారాన్ని వినియోగదారులు తప్పనిసరిగా మోయాల్సి ఉంటుందని ఇదివరకే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సంకేతాలను ఇచ్చారు. 110 డాలర్లలోపు ఉన్నంత వరకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఉద్దేశం ఉండదని, ఆ మార్క్ను దాటితే పెంపుదలపై నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో స్పష్టం చేశారు. ఇప్పుడా పరిస్థితి రానే వచ్చింది.
సరిగ్గా సంవత్సరం కిందట 68 డాలర్ల వరకు ఉన్న క్రూడాయిల్ బ్యారెల్ ధర.. ఇప్పుడు 110 డాలర్లను దాటింది. క్రూడాయిల్ బ్యారెల్ ధర స్థిరంగా 110 డాలర్లకు పైగా కొనసాగడమంటూ జరిగితే పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి వాటి రేట్ల జోలికి వెళ్లట్లేదు చమురు సంస్థలు. పాత ధరలను కొనసాగిస్తున్నాయి. ఇవ్వాళ కూడా అవే ధరలు ఉన్నాయి. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదా కంపెనీలు.
Brent crude oil price
— The Spectator Index (@spectatorindex) May 6, 2022
One year ago:
Now: 0
ఇదివరకు 17 రోజుల వ్యవధిలో 14 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. గురువారం నాటి రేట్లే ఇవ్వాళ కూడా కొనసాగుతున్నాయి. దీని ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.105.41 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ120.51 పైసలు, డీజిల్ రూ.104.77 పైసలుగా నమోదైంది. కోల్కతలో పెట్రోల్ రూ.115.12 పైసలు, డీజిల్ రూ.99.83 పైసలుగా ఉంటోంది.
చెన్నైలో పెట్రోల్ రేటు రూ.110.85 పైసలు, డీజిల్ 100.94 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.111.09 పైసలు, డీజిల్ రూ.94.79 పైసలుగా ఉంటోంది. గుర్గావ్లో పెట్రోల్ రూ.105.86 పైసలు, డీజిల్ 97.10 పైసలు, తిరువనంతపురంలో పెట్రోల్ రూ.117.19 పైసలు, డీజిల్ 103.95 పైసలుగా నమోదైంది.