Demonetisation: ఫెయిల్ అయిన నోట్ల రద్దు.. ఆరేళ్లలో పెరిగిన దొంగ నోట్లు.. ప్రధాని క్షమాపణ చెప్పాలి..?
Demonetisation: 2016లో ఒక్కసారిగా ప్రధాని మోదీ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. దేశంలో చెలామళిలో ఉన్న 1000, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు. బ్లాక్ మనీ, నకిలీ నోట్లను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ప్రధాని మోదీ తెలిపారు. ఇది సామాన్యులనే కాక వ్యాపారాలను సైతం భారీ స్థాయిలో కుదిపేసింది. దాదాపు 86 శాతం కరెన్సీ చెల్లకుండా పోయింది.
గతంలో డీమానిటైజేషన్..
బ్రిటీష్ పాలనలో దేశంలో మొట్టమొదటి డీమోనిటైజేషన్ జనవరి 12, 1946న జరిగింది. అప్పట్లో రూ.500, రూ.1000, రూ.10,000 నోట్లను భారత వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ సర్ ఆర్చిబాల్డ్ వేవెల్ నోట్ల రద్దును ప్రకటించారు. ఆ తర్వాత 1978లో రెండవసారి జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దు చేసింది. అప్పట్లో దేశాయ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి హెచ్.ఎం.పటేల్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక కార్యదర్శిగా ఉన్నారు.
6 ఏళ్ల తర్వాత..
బీజేపీ ప్రభుత్వ హయాంలో డీమానిటైజేషన్ పూర్తై 6 ఏళ్లు గడుస్తున్నా అది దాని లక్ష్యాలను అందుకోవటంలో విఫలమైందని తెలుస్తోంది. 21 అక్టోబర్ 2022 నాటికి దేశంలో ప్రజల వద్ద అందుబాటులో ఉన్న నగదు రికార్డు స్థాయిలో రూ.30.88 లక్షల కోట్లకు చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలో అవినీతి, నల్లధనం సమస్యలను తొలగించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8, 2016న నోట్ల రద్దును ప్రకటిస్తున్నట్లు దేశ ప్రజలకు తెలిపారు. అయితే ప్రస్తుతం కొత్త, అనుకూలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు అందుబాటులో ఉండి ప్రజాధరణ పొందినప్పటికీ.. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం నిరంతరం పెరుగుతూనే ఉంది.
రెండింతలైన నగదు ప్రవాహం..
డీమానిటైజేషన్ తర్వాత నగదు చెలామళి ఆరేళ్ల కాలంలో ఏకంగా రెండింతలకు పెరిగింది. స్వతంత్ర భారతదేశంలో నోట్ల రద్దు గొప్ప ఆర్థిక మూర్ఖత్వమని ప్రతిపక్షాలు అంటున్నాయి. నల్లధనం తగ్గితే టాక్స్ వసూళ్లు పెరుగుతాయని నోట్ల రద్దు సమయంలో ప్రభుత్వం భావించింది. కొందరు వ్యాఖ్యాతలు, ఆర్థికవేత్తలు ఇప్పుడు GST వసూళ్లలో బలమైన వృద్ధిని ఉదహరిస్తూ.. పెద్ద నోట్ల రద్దు విజయవంతమైందని అంటున్నారు. రాత్రికి రాత్రే నోట్ల రద్దు చేయటం వల్ల నగదు వినియోగం పడిపోతుందని ప్రధాని మోదీ భావిస్తే అది మూర్ఖత్వమేనని చాలా మంది అంటున్నారు.
పెరుగుతున్న నకిలీ నోట్లు..
దేశంలో నకిలీ నోట్ల సంఖ్య 10.7 శాతం పెరిగిందని RBI మే 27న విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. నకిలీ రూ.500 నోట్లు 101.93 శాతం, రూ.2,000 నకిలీ నోట్లు 54 శాతం, రూ.20 నకిలీ నోట్లు 16.48 శాతం, రూ.10 నకిలీ నోట్లు 16.45 శాతం పెరిగాయని ఏకంగా రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. నోట్ల రద్దు తర్వాత చాలా రూ.100 నకిలీ నోట్లు భారీగా పెరిగాయని గుర్తించబడ్డాయి.
మండిపడ్డ కేటీఆర్..
దేశంలో తీసుకున్న నోట్ల రద్దు ఘోర వైఫల్యమని తెలంగాణ టీఆర్ఎస్ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పితీరాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లక్ష్యాలను చేరుకోవటంలో నోట్ల రద్దు విఫలమైందని మండిపడ్డారు. ఇది ఆర్థిక వ్యవస్థను ఈ నిర్ణయం ఎలా కుంగదీసిందో మనం మరచిపోకూడదని అన్నారు. మోదీ హడావిడిగా తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలను, చిన్న వ్యాపారులను ఎలా దెబ్బతీసిందో గుర్తుచేసుకోవాలన్నారు. ఇది ఉగ్రవాదాన్ని అంతం చేస్తుందని చేసిన వాదనలు తప్పని రుజువయ్యాయని అన్నారు.