Adani Wilmar IPO: పూర్తి వివరాలివే..
ముంబై: గుజరాత్కు చెందిన దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన మరో సంస్థ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ను జారీ చేయడానికి సమాయాత్తమైంది. అదాని విల్మార్ లిమిటెడ్ త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. ఈ కంపెనీ చివరి నిమిషంలో ఐపీఓ ప్రతిపాదనల్లో కీలక మార్పులు చేసింది. ఐపీఓ సైజ్ను భారీగా తగ్గించింది. ఏకంగా 900 కోట్ల రూపాయల మేర సైజును కుదించడం రిటైల్ ఇన్వెస్టర్లల్లో గందరగోళానికి దారి తీయొచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
4,500 కోట్లుగా అనుకున్నా..
ముందుగా అనుకున్న ప్రకారం.. 4,500 కోట్ల రూపాయలకు బదులుగా 3,600 కోట్ల రూపాయల మేర ఐపీఓను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ కంపెనీలో అదానీ గ్రూప్, సింగపూర్కు చెందిన విల్మార్ గ్రూప్ జాయింట్ వెంచర్కు 50 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. 3,600 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది.
ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తంలో 1,900 కోట్ల రూపాయలను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, 1,100 కోట్ల రూపాయలను రుణాల చెల్లింపునకు వినియోగిస్తుంది. మిగిలిన 500 కోట్ల రూపాయలను వ్యూహాత్మక పెట్టుబడులకు వినియోగించాలని తాజాగా తన ప్రణాళికను రూపొందించుకుంది.
27న ఓపెనింగ్
అదాని విల్మార్ ఐపీఓ ఈ నెల 27వ తేదీన ఓపెన్ అవుతుంది. 31వ తేదీన ముగుస్తుంది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 218 నుంచి 230 రూపాయల వరకు నిర్దారించింది కంపెనీ యాజమాన్యం. గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) 65 రూపాయలు. పబ్లిక్ ఇష్యూ ఓపెన్ అయిన తరువాత జీఎంపీలో మార్పులు ఉండొచ్చు. మొత్తంగా 3,600 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలనే లక్ష్యంతో అదాని విల్మార్ ఈ పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది.
లాట్ సైజు ఇదీ...
ఈ ఐపీఓ లాట్ సైజు 65. కనీసం 65 షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే 14,950 రూపాయలను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో బిడ్డర్ ఒకేసారి గరిష్ఠంగా 13 లాట్స్ వరకు అప్లికేషన్ను దాఖలు చేయవచ్చు. ఫిబ్రవరి 3వ తేదీన షేర్ల అలాట్మెంట్ ఉంటుంది. అలాట్మెంట్ దక్కని వారికి ఆ మరుసటి రోజు నుంచి బిడ్డింగ్ మొత్తాన్ని రీఫండ్ చేస్తుందీ కంపెనీ. అదే నెల 8వ తేదీన బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లల్లో ఈ ఐపీఓ లిస్టింగ్ అవుతుంది.
ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కావడంతో..
అదాని విల్మార్.. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) సెగ్మెంట్2కు చెందిన కంపెనీ. ఫలితంగా- ప్రస్తుతానికి మంచి అంచనాలే ఉన్నాయి. టాప్ సెల్లింగ్ వంటనూనె బ్రాండ్ ఫార్చూన్ను ఉత్పత్తి చేస్తోంది ఈ కంపెనీయే. అదాని ఎంటర్ప్రైజెస్, సింగపూర్కు చెందిన ఆసియన్ అగ్రి బిజినెస్ విల్మార్ ఇంటర్నేషనల్తో జాయింట్ వెంచర్గా ఏర్పడిందీ కంపెనీ. 2027 నాటికి దేశంలో లార్జెస్ట్ ఫుడ్ కంపెనీగా ఆవిర్భవించాలనేది అదాని విల్మార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఇప్పటికే ఆరు..
పబ్లిక్ ఇష్యూకి వచ్చిన అనంతరం- అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి లిస్టెడ్ అయిన ఏడో కంపెనీగా గుర్తింపు పొందుతుంది. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి ఇప్పటికే ఆరు సంస్థలు బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లల్లో లిస్టింగ్ అయ్యాయి. రేపోమాపో పబ్లిక్ ఇష్యూ తేదీని ప్రకటించే సమయంలో అదానీ విల్మార్ లిమిటెడ్ తన ఐపీఓ సైజును తగ్గించుకోవడం పట్ల మార్కెట్ వర్గాలు ఆశ్చర్యపోతోన్నాయి.