వంటనూనెల ధరలను తగ్గించిన ఆ కంపెనీ: మరీ అంత నామమాత్రంగానా?
ముంబై: దేశంలో వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పప్పు దినుసులు, కూరగాయలు మండిపోతున్నాయి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, రిటైల్ ప్రైస్ ఇండెక్స్.. ఈ విషయాన్ని గణాంకాలతో సహా స్పష్టం చేశాయి. మే నెలలో 15.88 శాతం మేర హోల్సేల్ ద్రవ్యోల్బణం రికార్డయింది. 12 సంవత్సరాల తరువాత ఈ స్థాయిలో రికార్డు కావడం ఇదే తొలిసారి.
వాట్సప్తో టైఅప్: ఇంట్లో నుంచే పోస్టాఫీస్ సేవలు: ఆర్డీ పేమెంట్స్ సహా అన్నీ
కస్టమ్స్ డ్యూటీ రద్దుతో..
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.. కాస్త ఆలస్యంగానైనా. ప్రత్యేకించి- సన్ఫ్లవర్, సోయాబీన్ నూనె దిగుమతులపై వసూలు చేస్తోన్న కస్టమ్స్ డ్యూటీ రద్దు చేసింది. దీనిపై విధించిన అయిదు శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ను ఎత్తివేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ఈ నోటిఫికేషన్ అమల్లో ఉంటుంది.
రెండేళ్ల పాటు కొనసాగింపు..
2024 మార్చి వరకు కూడా కస్టమ్స్ డ్యూటీ, అగ్రిసెస్ ఎత్తివేత అనేది కొనసాగుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సోయాబీన్, సన్ఫ్లవర్ క్రూడ్పై 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఈ కస్టమ్స్ డ్యూటీ, అగ్రిసెస్ ఎత్తివేతను వర్తింపజేసింది. వంటనూనెలను దిగుమతి చేసుకోవడంలో ప్రపంచలోనే అతిపెద్ద దేశం.. భారత్.
వంటనూనెలపై..
నిత్యావసర సరుకుల ధరలు, వంటనూనె రేట్లు అమాంతంగా పెరిగిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- వాటిని నియంత్రించడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కిందటి నెలలో నోటిఫికేషన్ను జారీ చేసింది. పామాయిల్ వంటి వంటనూనెల దిగుమతులపై వసూలు చేస్తోన్న సాధారణ పన్నులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. దిగుమతి లెవీని తొలగించింది.
ధర తగ్గించిన అదాని విల్మార్..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రముఖ వంటనూనెల తయారీ కంపెనీ అదాని విల్మార్ స్పందించింది. తన ఉత్పత్తుల ధరలను తగ్గించింది. ఒక్కో ప్రొడక్ట్ గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ)పై 10 రూపాయలు తగ్గించినట్లు తెలిపింది. అదాని విల్మార్ ఉత్పత్తి చేస్తోన్న 220 రూపాయల ఫర్చూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ పాకెట్ ఇకపై 210 రూపాయలకే లభిస్తుంది.
రూ.10 తగ్గింపు..
అలాగే- 210 రూపాయలు పలికే ఫర్చూన్ సోయాబీన్ ఆయిల్ ప్యాకెట్.. 200 రూపాయలు, 205 రూపాయల ఫర్చూన్ ఆవనూనె లీటర్ పాకెట్ 195 రూపాయలకు లభిస్తుంది. తగ్గించిన రేట్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనేది ఇంకా వెల్లడించలేదు అదాని విల్మార్ కంపెనీ యాజమాన్యం. దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన విడుదల చేస్తామని అదాని విల్మార్ ఎండీ అగ్షు మల్లిక్ తెలిపారు.
వేర్వేరు ప్రొడక్ట్స్..
అదాని విల్మార్.. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెగ్మెంట్కు చెందిన లీడింగ్ కంపెనీ. వంటనూనె, బియ్యం, గోధుమలు, చక్కెర, బేసన్ వంటి ఉత్పత్తుల్లో కొనసాగుతోంది. రెడీ టు కుక్ ఖిచిడీ, సోయా ఛంక్స్.. వంటి ప్రొడక్ట్స్ను ఉత్పత్తి చేస్తోంది. అదాని విల్మార్.. ఈ ఏడాదే స్టాక్ మార్కెట్లోనూ ఎంట్రీ ఇచ్చింది. శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఈ కంపెనీ షేర్లు 589 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.