Adani: అంతా అదానీ మయం.. మరో కీలక పోర్టును సొంతం చేసుకున్న అదానీ పోర్ట్స్.. డీల్ విలువ..
Adani Ports: ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ఉన్న అదానీ మరో చరిత్రాత్మక డీల్ కుదుర్చుకున్నారు. పోర్టుల వ్యాపారంలో గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా ముందుకెళుతున్న సంస్థ తాజాగా కొత్త టెండర్లను దక్కించుకుంది. దీంతో దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ చాలా కీలకంగా కంపెనీ విస్తరణ జరుగుతుందని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. దీనిని చారిత్రాత్మకమైన ఒప్పందంగా పేర్కొంటూ, సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదానీ పోర్ట్స్ 2025 నాటికి కార్గో వాల్యూమ్లలో 60% వృద్ధితో 500 MTకి చేరుకుంటుందని కంపెనీ అంచనా వేసింది. ఈ వార్తతో అదానీ పోర్ట్స్ స్టాక్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మిలిటరీ టరిత్రలో..
అదానీ ట్విట్టర్ లో వెల్లడించిన వివరాల ప్రకారం.. అదానీ పోర్ట్స్ సంస్థ ఇజ్రాయెలీ భాగస్వామి గాడోట్ తో కలిసి.. ఇజ్రాయెల్ లో కీలకమైన హైఫా పోర్ట్ ప్రైవేటీకరణ కోసం జూలై 14న టెండర్ దాఖలు చేసింది. టెండర్ గెలుచుకోవటం తనకు చాలా ఆనందంగా ఉందని అదానీ తెలిపారు. ఈ పోర్ట్ రెండు దేశాలకు వ్యూహాత్మకదని, చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉందని తన ట్వీట్ లో తెలిపారు. సైనిక చరిత్రలో కూడా ఇది చాలా కీలకమైనదని ఆయన పేర్కొన్నారు.
2054 వరకు అదానీ చేతిలో..
రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ డీల్ విలువ 1.18 బిలియన్ డాలర్లని తెలుస్తోంది. ఈ డీల్ ద్వారా ఇజ్రాయెలీ పోర్టులో 70 శాతం వాటా అదానీ పోర్ట్స్కు ఉంటుందని, మిగిలిన 30 శాతం గాడోట్కు చెందినదని సమాచారం. ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తయినట్లు హైఫా పోర్ట్ చైర్మన్ ఎషెల్ అర్మోనీ ధృవీకరించారు. ఈ బిడ్ ద్వారా 2054 వరకు కొత్తగా టెండర్ గెలుచుకున్న సంస్థలు పోర్టును నిర్వహిస్తాయి. పోర్టు పనితీరును, పోటీతత్వాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోర్టు వర్గాలు తెలిపాయి.
అదానీకి లాభమే..
అదానీ-గాడోట్ జట్టు హైఫాలోని మరొక పోర్ట్ నుంచి పోటీని ఎదుర్కొంటోంది. ఆ పోర్టును చైనాకు సంబంధించిన షాంఘై ఇంటర్నేషనల్ పోర్ట్ గ్రూప్ (SIPG) నిర్వహిస్తోంది. వస్తువుల ఎగుతమతి, దిగుమతులకు ఇజ్రాయెల్ ఎక్కువగా సముద్ర మార్గంపై ఆధారపడటంతో అదానీ గ్రూప్ కు ఈ డీల్ లాభదాయకమైనదేనని నిపుణులు అంటున్నారు. ఇజ్రాయెల్, దాని గల్ఫ్ పొరుగు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో పోర్ట్ ఆపరేటర్ల వ్యాపారం సానుకూలంగా ప్రభావితమవుతుందని భావిస్తున్నారు.