గంగవరం పోర్టులో 58% వాటాలు కొనుగోలు చేసిన అదానీ, రుణరహిత ఓడ రేవు..
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్(APSEZ) ఆంధ్రప్రదేశ్లోని గంగవరం పోర్ట్లో 58.1 శాతం వాటాను కొనుగోలు చేసింది. తద్వారా ఈ పోర్టులో మెజార్టీ వాటాలు సొంతం చేసుకుంటోంది. ఈ మేరకు అదానీ గ్రూప్ మంగళవారం ప్రకటించింది. డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి చెందిన 58.1 శాతం వాటాను రూ.3,604 కోట్లకు కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే ఈ పోర్టు కంపెనీలోని 31.5 శాతం వాటాను రూ.1,954 కోట్లకు వార్బర్గ్ పింకస్ సంస్థ అనుబంధ కంపెనీ విండీ లేక్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు పూర్తయితే గంగవరం పోర్టులో అదానీ గ్రూప్ వాటా 89.6 శాతానికి చేరుతుంది.
మరింత వృద్ధికి ఆస్కారం
గంగవరం పోర్ట్ విశాఖకు సమీపంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని రెండో అతిపెద్ద నాన్-మేజర్ పోర్ట్. 64 ఎంఎంటీ కెపాసిటీ కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీతో దీనిని నిర్మించారు. ఇది బాగా లోతైన పోర్ట్. ఏ కాలంలో అయినా 200,000 DWT సామర్థ్యం కలిగిన సూపర్ కేప్ సైజ్ ఓడలు వచ్చి వెళ్లగలవు. గంగవరం పోర్ట్ ప్రస్తుతం 9 బెర్తులు ఉన్నాయి. 1800 ఎకరాల్లో ఇది విస్తరించబడి ఉంది. 31 బెర్త్లతో 250 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో గంగవరం పోర్ట్ తగినంత హెడ్ రూం కలిగి ఉందని APSEZ ఓ ప్రకటనలో తెలిపింది.
క్యాష్ బ్యాలెన్స్
గంగవరం పోర్ట్ ద్వారా డ్రై, బల్క్ కమోడిటీస్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్, పంచదార, అల్యూమినియం, ఉక్కు ఎగుమతులు లేదా దిగుమతులు సాగుతున్నాయి. తూర్పు, పడమర, దక్షిణ, మధ్య భారత్లోని ఎనిమిది రాష్ట్రాల నుండి గంగవరం పోర్టుకు సరకు రవాణా సాగుతోంది. FY20లో గంగవరం పోర్ట్ కార్గో వ్యాల్యూమ్ 34.5 ఎంఎంటీ. రెవెన్యూ రూ.1,082 కోట్లు. ఎబిటా రూ.634 కోట్లు (59 శాతం మార్జిన్), పీఏటీ రూ.516 కోట్లు. ఎలాంటి రుణాలు లేని గంగవరం పోర్టుకు రూ.500 కోట్ల క్యాష్ బ్యాలెన్స్ ఉంది.
ఎవరి వాటా ఎంతంటే
గంగవరం పోర్ట్ పెయిడప్ షేర్ క్యాపిటల్ 51.70 కోట్ల షేర్లు. ఇందులో డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి 58.1 శాతం వాటా ఉంది. ఏపీ ప్రభుత్వ వాటా 10.4 శాతం. వార్బర్గ్ పింకస్ వాటా 31.5 శాతం. వార్బర్గ్ పింకస్, డీవీఎస్ రాజు, ఆయన కుటుంబ వాటానే తాజాగా అదానీ గ్రూపు కొనుగోలు చేస్తోంది. దీంతో గంగవరం పోర్టు కంపెనీలో 89.6 శాతం వాటాను అదానీ పోర్ట్స్ దక్కించుకుంది. కొంతకాలం క్రితం ఏపీలోని కృష్ణపట్నం పోర్టును అదానీ పోర్ట్స్ సొంతం చేసుకుంది.