ఇస్రో సార్వభౌమత్వానికి గండి: పీఎస్ఎల్వీ తయారీ కాంట్రాక్ట్ రేసులో అదాని, ఎల్ అండ్ టీ
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. సార్వభౌమత్వానికి గండి పడుతోందా?, ఇప్పటిదాకా సొంత పరిజ్ఙానంతో ఎన్నో అద్భుతాలను సృష్టించి, అంతరిక్షంపై ఆధిపత్యాన్ని చలాయించిన ఇస్రో తన ప్రాభవాన్ని కోల్పోతోందా?, ఇస్రో పరిశోధనలు, ఉపగ్రహ వాహకనౌకల తయారీలో కార్పొరేట్ పెద్దతలకాయలు జోక్యం చేసుకునున్నాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇస్రో అమ్ములపొదిలో తిరుగులేని పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ (పీఎస్ఎల్వీ) తయారీ ఇక ప్రైవేటు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లనుంది.
పీఎస్ఎల్వీ తయారీ..
ఇస్రో తలపెట్టిన అంతరిక్ష ప్రయోగాల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా మొట్టమొదట వినిపించే పేరు.. పీఎస్ఎల్వీ. తిరుగులేని అంతరిక్ష వాహకనౌక. ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన శాటిలైట్లను తీసుకుని నింగి వైపు దూసుకెళ్లే వాహక నౌక ఇది. ఇన్ని సంవత్సరాల పాటు ఇస్రో సొంతంగా దీన్ని తయారు చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ అధికారం ఇస్రో చేతుల్లో నుంచి జారిపోనుంది. పీఎస్ఎల్వీల తయారీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేసింది. ఇందులో భాగంగా పీఎస్ఎల్వీ తయారీ పనులు ఇక కార్పొరేట్ పరం కానుంది.
బడా కార్పొరేట్ కంపెనీలు రేసులో..
దీనికి అనుగుణంగా- పీఎస్ఎల్వీల తయారీ కాంట్రాక్ట్ను పొందడానికి బడా కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతోన్నాయి. పీఎస్ఎల్వీ తయారీ కాంట్రాక్ట్ను పొందడానికి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఎల్ అండ్ టీ సారథ్యంలోని కన్సార్టియాలు రేసులో నిల్చున్నాయి. ఈ రెండు కన్సార్టియాలతో పాటు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) సింగిల్ కంపెనీగా బిడ్స్ను దాఖలు చేశాయి. గుజరాత్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానికి చెందిన కంపెనీ అదాని గ్రూప్.
కన్సార్టియాలతో..
దీని సారథ్యంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కన్సార్టియంగా ఏర్పడ్డాయి. అలాగే- ఎల్ అండ్ టీ సారథ్యంలోని కన్సార్టియంలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది. ఈ రండింటితో పాటు బీహెచ్ఈఎల్ సింగిల్ కంపెనీగా బిడ్స్ దాఖలు చేసింది. ఈ బిడ్స్ అన్ని టెక్నో-కమర్షియల్ ఎవాల్యూషన కింద ఉన్నాయని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ డీ తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పర్యవేక్షణలో కార్యకలాపాలను సాగిస్తోన్న కంపెనీ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్.
30వ తేదీ వరకు బిడ్స్..
కిందటి నెల 30వ తేదీ వరకు అదాని గ్రూప్, ఎల్ అండ్ టీ, బీహెచ్ఈఎల్ నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్ దాఖలైనట్లు చెప్పారు. ఎవాల్యూషన్ పూర్తయిన తరువాత.. అర్హత సాధించిన కన్సార్టియాన్ని ఎంపిక చేస్తామని, పీఎస్ఎల్వీ తయారీ కాంట్రాక్ట్ పనులను దానికి అప్పగిస్తామని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రక్రియ ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఎస్ఎల్వీ తయారీ ప్రక్రియ మొత్తం ఎండ్-టు-ఎండ్.. ప్రైవేటు పరం కాబోతోండటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తొలిదశ పూర్తయినట్టే..
అదాని వంటి బడా పారిశ్రామికవేత్త ఇక అంతరిక్ష పరిశోధనల సెక్టార్లో కూడా అడుగు పెట్టినట్టవుతుందనే అభిప్రాయాలు సర్వాత్రా వినిపిస్తోన్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న పెట్టుబడుల ఉపసంహరణ విధానం పరిధిలోకి ఇస్రోను కూడా చేర్చడానికి దీన్ని తొలి అడుగుగా భావించే వారు కూడా ఉన్నారు. క్రమంగా ఇస్రో సైతం ప్రైవేటీకరణ దిశగా సాగుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ను ఆహ్వానించడంతో తొలిదశలో కీలకమైన పీఎస్ఎల్వీ ప్రైవేటీకరణ పూర్తి అయినట్టేనని అంటున్నారు.