Gowtham Adani: మరో పవర్ ప్లాంట్ కొనేందుకు సిద్ధమైన గౌతమ్ అదానీ.. డీల్ పూర్తి వివరాలు ఇలా..
Ind-Barath Power Plant: సుమారు ఆరేళ్లుగా మూతపడిన తమిళనాడులోని ఓ పెద్ద పవర్ ప్లాంట్ తాళం తెరుచుకోనుంది. త్వరలోనే మళ్లీ ఇది పనిచేయటం ప్రారంభించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పవర్ ప్లాంట్ ను సొంతం చేసుకునేందుకు.. దేశంలోని ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పోటీలో ఉన్నారు. దీన్ని కొనుగోలు చేసేందుకు ఆసియాలోనే అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్ కంపెనీ, నవీన్ జిందాల్ కు సంబంధించిన జిందాల్ పవర్ కంపెనీలు దాని కోసం పోటీపడుతున్నాయి. పవర్ జనరేషన్, పవర్ ట్రాన్స్ మిషన్ రంగాల్లో వరుసగా అనేక కంపెనీలను సొంతం చేసుకుంటూ దూకుడుగా ముందుకు వెళుతున్న గౌతమ్ అదానీ ఈ కంపెనీని సైతం సొంతం చేసుకుంటారో లేదో తెలియాల్సి ఉంది. ఈ డీల్ పై మార్కెట్ వర్గాలు ఓ కన్నేసి ఉంచాయి.
టుటికోరిన్లో పవర్ ప్లాంట్..
తమిళనాడులోని టుటికోరిన్లో ఉన్న దివాలా తీసిన ఇండ్-బరత్ థర్మల్ పవర్ ప్లాంట్ ని సొంతం చేసుకోవటానికే పోటీ కొనసాగుతోంది. ఎకనామిక్ టైమ్స్లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. గౌతమ్ అదానీ, నవీన్ జిందాల్ ఇద్దరూ దీనిని తమ సొంతం చేసుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. ప్లాంట్ ను సొంతం చేసుకునేందుకు రెండు సంస్థలు బిడ్డింగ్కు సిద్ధమవుతున్నాయి.
డీల్ వివరాలు..
ప్లాంట్ మళ్లీ పని చేయడానికి కొనుగోలుదారు సుమారు రూ. 75 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని బిడ్డర్ కు పంపిన నోట్లో తెలపబడింది. ఇందులో దేశంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం దృష్ట్యా దివాళా తీసిన, మూతపడిన విద్యుత్ సంస్థలపై ఇప్పుడు పారిశ్రామికవేత్తల ఆసక్తి పెరుగుతోందని తెలుస్తోంది. ఇందుకోసం సాయం చేసేందుకు ప్రభుత్వం కూడా ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది.
2016లో మూతబడిన పవర్ ప్లాంట్..
ఇండ్-బారత్ థర్మల్ పవర్ ప్లాంట్లో రెండు పూర్తిస్థాయి 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. అయితే.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (PPAలు) లేకపోవడంతో దివాలా తీసిన తర్వాత 2016లో మూసివేయబడింది. కంపెనీకి దాదాపు రూ.2,148 కోట్ల రుణం ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇందులో అత్యధికంగా 21 శాతం రుణాన్ని అందించింది. ఇది కాకుండా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు(SBI) 18 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంకులు కూడా లోన్ అందించిన రుణదాతల్లో ఉన్నాయి.