Adani Group: అదానీ గ్రూప్కు షాక్, సెబీ దర్యాఫ్తు, కుప్పకూలిన షేర్లు
అదానీ గ్రూప్కు చెందిన కొన్ని కంపెనీలపై సెబి, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) దర్యాఫ్తు చేస్తున్నాయని లోకసభకు ప్రభుత్వం సోమవారం తెలిపింది. సెబి నిబంధనలను పాటించలేదనే ఆరోపణలపై అదానీ గ్రూప్కు చెందిన కొన్ని కంపెనీలపై సెబి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ సహాయమంత్రి లోకసభకు తెలిపారు. తన చట్ట పరిధిలోకి వచ్చే అదానీ గ్రూప్కు చెందిన కొన్ని సంస్థల ట్రాన్సాక్షన్స్ పైన DRI కూడా దర్యాఫ్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఈడీ మాత్రం అదానీ గ్రూప్ పైన ఎలాంటి దర్యాఫ్తు నిర్వహించడం లేదన్నారు.
నిన్న భారీగా పతనం
కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి ప్రకటన నేపథ్యంలో నిన్న (సోమవారం) అదానీ గ్రూప్ స్టాక్స్ పతనమయ్యాయి. కొన్ని స్టాక్స్ లోయర్ సర్క్యూట్ను తాకాయి. నిన్న ఒక్కరోజే అదానీ టోటల్ గ్యాస్ 4.77 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 4.07 శాతం, అదానీ పవర్ 2.8 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 2.76 శాతం, అదానీ పోర్ట్స్ 2.08 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 1.01 శాతం నష్టపోయాయి.
నేడు కూడా 5 శాతం వరకు పతనం
అదానీ టోటల్ గ్యాస్ నేడు కూడా భారీగా పతనమైంది. నేడు మధ్యాహ్నం సమయానికి మరో 5 శాతం క్షీణించి రూ.812 వద్ద ట్రేడ్ అయింది. అదానీ ట్రాన్స్మిషన్ షేర్ 5 శాతం తగ్గి రూ.919 వద్ద, అదానీ పవర్ షేర్ 4.99 శాతం క్షీణించి రూ.97.05 వద్ద, అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా 5 శాతం తగ్గి రూ.930.20 వద్ద, అదానీ పోర్ట్స్ 1.39 శాతం తగ్గి రూ.664.35 వద్ద, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 2.29 శాతం తగ్గి రూ.1349 వద్ద ట్రేడ్ అయింది.
స్పందించిన అదానీ గ్రూప్
ఇదిలా ఉండగా, అదానీ గ్రూప్ కంపెనీలపై సెబి, DRI దర్యఫ్తు పైన కంపెనీ స్పందిచింది. తాము ఎప్పుడు పారదర్శకంగా వ్యాపారం చేస్తున్నామని స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగానే ఉన్నామని, రెగ్యులేటర్ పైన పూర్తి విశ్వాసం ఉందని అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి సోమవారం అన్నారు.