ఒక్కరోజే రూ.54వేలకోట్ల పతనం, 'అదానీ' వివరణ తర్వాత కాస్త రికవరీ
అదానీ గ్రూప్ సంస్థలకు భారీ షాక్ తగిలింది. ఈ గ్రూప్ షేర్లలో రూ.43,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్పోలియో ఇన్వెస్టర్లు అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఖాతాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాసిటరీ లిమిటెడ్-NSDL మే 31వ తేదీ నుండి స్తంభింప చేసినట్లు వార్తలు రావడంతో అదానీ గ్రూప్ షేర్ల వ్యాల్యూ ఓ సమయంలో 25 శాతం పతనమైంది. అయితే ఆ తర్వాత అదానీ గ్రూప్ దీనికి సంబంధించి వివరణ ఇచ్చాక షేర్లు కాస్త రికవరీ అయ్యాయి.
ఖాతాలను ఫ్రీజ్ చేయలేదు
తమ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మూడు ఫండ్స్ ఖాతాలను స్తంభింపచేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఈ తప్పుడు ప్రచారంతో ఇన్వెస్టర్లకు తీరని ఆర్థిక నష్టం కలిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ మూడు FPI డీమ్యాట్ ఖాతాలపై సరైన సమాచారం ఇవ్వాలని రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ను సంప్రదించినట్లు తెలిపింది. డీమ్యాట్ ఖాతాలను స్తంభింపచేయలేదని అక్కడ నుండి తమకు ఈ-మెయిల్లో సమాధానం వచ్చిందని వెల్లడించింది. NSDL కూడా సోమవారం రాత్రి దీనిని ధ్రువీకరించింది.
రూ.54వేల కోట్లు పతనం
అదానీ వివరణ అనంతరం ఈ గ్రూప్ కంపెనీల షేర్లు సాయంత్రానికి భారీ నష్టాల నుండి కోలుకున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ ఇంట్రాడేలో 24.99 శాతం పతనం కాగా, చివరకు 6.26 శాతం నష్టంతో రూ.1501.25 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్ 8.36 శాతం, అదానీ గ్రీన్ 4.13 శాతం నష్టపోయాయి. అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 5 శాతం, అదానీ పవర్ 5 శాతం నష్టపోయి లోయర్ సర్క్యూట్ను తాకాయి. మొత్తానికి అదానీ గ్రూప్ స్టాక్స్ మార్కెట్ వ్యాల్యూ నిన్న ఒక్కరోజే రూ.54 వేల కోట్లు పడిపోయింది.
పెట్టుబడులు ఇలా...
అదానీ ట్రాన్స్మిషన్లో అల్బులా రూ.3,713 కోట్లు, క్రెస్టా రూ.6,560 కోట్లు, ఏపీఎంఎస్ రూ.3,132 కోట్లు, అదానీ ఎంటర్ ప్రైజెస్లో అల్బులా రూ.3,339 కోట్లు, క్రెస్టా రూ.4,397 కోట్లు, ఏపీఎంఎస్ రూ.2,348 కోట్లు, అదానీ టోటల్లో అల్బులా రూ.3,249 కోట్లు, క్రెస్టా రూ.2,276 కోట్లు, ఏపీఎంఎస్ రూ.4,524 కోట్లు, అదానీ గ్రీన్లో అల్బులా రూ.2,250 కోట్లు, ఏపీఎంఎస్ రూ.4,267 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. అదానీకి చెందిన ఇతర కంపెనీల్లో అల్బులా రూ.690 కోట్లు, క్రెస్టా రూ.351 కోట్లు, ఏపీఎంఎస్ రూ.505 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి.