Adani: అంబానీకి గట్టి పోటీ ఇచ్చేందుకు గౌతమ్ అదానీ సరికొత్త వ్యూహం.. మెగా ప్లాన్ ఏమిటంటే..
Adani Vs Ambani: ఆసియాలోనే అత్యంత సంపన్నులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలు మరో రంగంలో తలపడనున్నారు. భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి అదానీ గ్రూప్, ఫ్లిప్కార్ట్ మధ్య చర్చలు ముందస్తు రౌండ్లో ఉన్నాయి. అదానీ ఈ-కామర్స్ రంగంలో తన ఉనికిని విస్తరించాలని కోరుకుంటోంది. ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం ఈ వ్యూహంలో భాగమే. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్.. అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ ఇంక్ యాజమాన్యంలో ఉంది. అదానీ గ్రూప్, ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం వేర్హౌసింగ్, డేటా సెంటర్లలో భాగస్వామ్యాన్ని నడుపుతున్నాయి. కానీ ఇప్పుడు హోల్సేల్ ఈ-కామర్స్, సోర్సింగ్ కిరాణా, గృహోపకరణాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇదే జరిగితే.. వీరు అంబానీకి చెందిన జియోమార్ట్, జెఫ్ బెజోస్ కు చెందిన అమెజాన్లకు గట్టి పోటీ ఇవ్వనున్నారు.
హోల్సేల్ కస్టమర్ల కోసం:
అదానీ వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం వాల్మార్ట్తో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని ప్రముఖ వార్తా పత్రిక వెల్లడించింది. దీని కింద ఫ్లిప్కార్ట్ అనేక రకాల ఉత్పత్తులను విక్రయించవచ్చు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు కంపెనీలు పంచుకోవచ్చని తెలుస్తోంది. దీంతో రెండు కంపెనీలకు మేలు జరుగనుంది. ఫ్లిప్కార్ట్ రిటైలర్లకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్న అనేక రకాల ఉత్పత్తులను కలిగి ఉంటుంది. దీనితో పాటు, అదానీ గ్రూప్ కంపెనీలతో అనుబంధించబడిన కొత్త హోల్సేల్ కస్టమర్లను కూడా తాజా డీల్ ద్వారా పొందనుంది. వస్తువుల విక్రయాన్ని అదానీ గ్రూప్, ఫ్లిప్కార్ట్ సంయుక్తంగా నిర్వహిస్తాయని తెలుస్తోంది. అదానీ ఈ-కామర్స్ రంగంలో తన ఉనికిని విస్తరించాలని కోరుకుంటోంది. ఫ్లిప్కార్ట్తో అదానీ గ్రూప్ చేసుకుంటున్న భాగస్వామ్య ఒప్పదం ఈ వ్యూహంలో భాగమే.
ప్రణాళిక ఏమిటంటే..
ఫ్లిప్కార్ట్ బలంగా లేని ప్రదేశాల్లో అదానీ గ్రూప్ FMCG ఉత్పత్తులకు నిల్వ, పంపిణీ సౌకర్యాలను అందించవచ్చని తెలుస్తోంది. దీంతో ఆయా ప్రదేశాల్లో ఫ్లిప్కార్ట్ పెద్ద సంఖ్యలో హోల్సేల్ కస్టమర్లను పొందే అవకాశం లభిస్తుంది. అదానీ క్రియాశీల ఈ-కామర్స్ వ్యాపారాన్ని కూడా పొందుతుంది. ఫ్లిప్కార్ట్ హోల్సేల్ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయంలో కూడా వాటాను పొందుతుంది. ఈ భాగస్వామ్యం కొనసాగితే.. Amazon, JioMartలకు దేశవ్యాప్తంగా గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రస్తుతం.. ఫ్లిప్కార్ట్ హోల్సేల్ దేశంలో 28 బెస్ట్ ప్రైస్ స్టోర్లను(Best Price) కలిగి ఉంది.
అదానీ తాజా వ్యాపార విస్తరణ డీల్స్:
కొద్ది రోజుల క్రితం పవర్ ట్రాన్స్ మిషన్ వ్యాపారంలో ఎస్సర్ గ్రూప్ కంపెనీని చేజిక్కించుకుంది అదానీ గ్రూప్. తాజాగా.. సపోర్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL), ఎటర్నస్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ (EREPL) అనే రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో 100% ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక కొనుగోలు ఒప్పందాలను ఖరారు చేసుకున్నట్లు అదానీ పవర్ మంగళవారం తెలిపింది. SPPL మొత్తం ఈక్విటీ విలువ రూ. 280.10 కోట్లు కాగా, EREPL విలువ రూ. 329.30 కోట్లుగా ఉంది. రెండు వారాల్లో నగదు రూపంలో ఈ లావాదేవీలు పూర్తవుతాయని అదానీ గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు.